సముద్రంలో కూలిన హెలికాప్టర్.. 12 గంటలు సముద్రంలో ఈది ఒడ్డుకొచ్చిన...

Madagascar: కష్టాల్లో చిక్కుకుని బయటపడేందుకు చుట్టూ ఏ దారి కన్పించడం లేదు.

Update: 2021-12-23 02:20 GMT

సముద్రంలో కూలిన హెలికాప్టర్.. 12 గంటలు సముద్రంలో ఈది ఒడ్డుకొచ్చిన..

Madagascar: కష్టాల్లో చిక్కుకుని బయటపడేందుకు చుట్టూ ఏ దారి కన్పించడం లేదు. అలాంటప్పుడు దృఢసంకల్పం ఉంటే కష్టాలకు ఎదురీది ప్రాణాలు నిలబెట్టుకోవచ్చని నిరూపించారు మడగాస్కర్ రక్షణ మంత్రి జనరల్ సెర్జ్ గెల్లె. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నడిసముద్రంలో కూలిపోయింది. దీంతో అలుపు, సొలుపు లేకుండా 12 గంటల పాటు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు కాపాడుకున్నారు.

64 మంది ప్రయాణికులతో వెళ్తూ హిందూ మహా సముద్రంలో బోటు మునిగిపోయిన ప్రదేశాన్ని పరిశీలించేందుకు మంత్రి సోమవారం సాయంత్రం హెలికాప్టర్‌లో బయలుదేరారు. ఈ క్రమంలో సాంకేతిక కారణాలతో హెలికాప్టర్ ఒక్కసారిగా సముద్రంలో కూలిపోయింది. ఆయనతో పాటు ప్రయాణించిన ముగ్గురి జాడ కన్పించలేదు. ఆయన మాత్రం సీటును ఊడదీసి లైఫ్ జాకెట్‌లా వాడుకున్నారు. ఆపై 12 గంటల పాటు ఈది తీరానికి చేరుకున్నారు. చేపల వేటకు వెళ్లిన ఓ జాలరి తీరానికి సమీపంలో ఆయనను గమనించి ఒడ్డుకు చేర్చాడు. మరోవైపు మంత్రితో పాటు ప్రయాణించిన వారిలో చీఫ్ వారంట్ అధికారి జిమ్మీ లాయిట్సారా కూడా అలాంటి సాహసమే చేశారు. ఆయన ఈదుకుంటూ మహాంబో తీరానికి చేరుకున్నారు.

ప్రాణాలతో బయటపడిన రక్షణమంత్రి జనరల్ సెర్జ్‌ గెల్లె ఆ తర్వాత ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు. దేవుడి నుంచి తనకు పిలుపు రానందుకే తీరానికి చేరుకోగలిగానని పేర్కొన్నారు. తనకేం కాలేదని అయితే బాగా తడిసిపోయానన్నారు. తన సహచరులు మాత్రం చనిపోయి ఉండొచ్చని విచారం వ్యక్తం చేశారు.

ప్రమాద సమయంలో బ్రతకడానికి ఏమేమీ చేయాలో అన్నీ చేశానని బరువైన వస్తువులన్నీ వదిలేశామని గుర్తు చేసుకున్నారాయన. తాను బాగానే ఉన్నానని మరో 24 గంటల్లో విధులకు హాజరవుతానని జనరల్ సెర్జ్‌ గెల్లె చెప్పుకొచ్చారు. కాగా మంత్రి పోస్టు చేసిన వీడియో వైరల్ అయిన తర్వాత మంత్రిని అందరూ హీరో అని కొనియాడుతున్నారు. కాగా, పడవ ప్రమాదంలో మృతి చెందిన వారిలో 25 మంది మృతదేహాలు నిన్న లభ్యమయ్యాయి.


Tags:    

Similar News