China - India Conflicts: అరుణాచల్‌లో చైనాకు దీటుగా భారత్

*భారత సరిహద్దు వెంట 100 రాకెట్లు లాంఛర్లు మోహరించిన చైనా *భారత నేతల పర్యటలనపై అభ్యంతరం

Update: 2021-10-21 05:32 GMT

అరుణాచల్‌లో చైనాకు దీటుగా భారత్(ఫైల్ ఫోటో)

China - India Conflicts: భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలకు దీటుగా జవాబిచ్చేలా భారత సైన్యం సిద్ధమయ్యింది. శత్రువుల యుద్ధ విమానాలను కూల్చివేసే L‌-70 విమాన విధ్వంసక శతఘ్నులు, హోవిట్జర్‌ శతఘ్నులు వంటి వాటిని వాస్తవాధీన రేఖ వెంబడి పెద్ద సంఖ్యలో మోహరించింది. సముద్ర మట్టానికి 15 వేల అడుగుల ఎత్తులో ఏకంగా ఆర్టిలరీ యూనిట్‌నే భారత్ సైన్యం నెలకొల్పింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటైన ఆర్టిలరీ యూనిట్‌ ఇదే కావడం గమనార్హం.

అలాగే LAC వెంబడి ఇంటెగ్రేటెడ్‌ డిఫెండెడ్‌ లొకాలిటీలను కూడా సిద్ధం చేసింది భారత్. తూర్పు సెక్టార్‌లో వ్యూహాత్మక ప్రాంతమైన తవాంగ్‌ నుంచి వాస్తవాధీన రేఖకు వెళ్లే మార్గంలో పెద్ద సంఖ్యలో ఇలాంటి ప్రాంతాలు అనేకం కనిపిస్తాయి. M-777 అల్ట్రా లైట్‌ హోవిట్జర్‌ శతఘ్నులను కూడా ఈ సెక్టారులో ఏర్పాటు చేశారు. కేవలం 4 టన్నుల బరువుండే వీటిని అవసరమైన చోట్లకు చినూక్‌ హెలికాప్టర్లలోనూ తరలించవచ్చు. లారీలోనూ రవాణా చేసే సౌలభ్యం ఉన్న హోవిట్జర్లు నిర్దేశిత స్థానానికి చేర్చిన తర్వాత కొన్ని నిమిషాల్లోనే వినియోగానికి సిద్ధం చేయవచ్చు. కేవలం 30 సెకన్లలోనే 40 కిలోమీటర్ల దూరం వరకూ విధ్వంసం సృష్టిస్తుంది. వీటికి అదనంగా కార్గిల్ యుద్ధంలో పాక్ వెన్ను విరిచిన బోఫోర్స్‌ గన్స్‌ను మోహరించారు.

తూర్పు సెక్టార్‌లోని అస్సాంహిల్స్‌ సమీపంలో ఏర్పాటు చేసిన ఆర్టిలరీ యూనిట్‌ అత్యంత కీలకమైనది. ఇక్కడి నుంచి చైనా భూభాగం లోపల 50 కిలోమీటర్ల వరకూ అగ్ని వర్షం కురిపించవచ్చు. రఫేల్‌ యుద్ద విమానాలు, అపాచి, రుద్ర హెలికాప్టర్లనూ సమీకృత రక్షణ ప్రాంతాల్లో మోహరించారు. తూర్పు కమాండ్‌ పరిధిలోని 1,300 కిలోమీటర్ల పొడవైన సరిహద్దులను శత్రు దుర్భేద్యం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని ఓ అధికారి వెల్లడించారు.

Tags:    

Similar News