రైల్వే ట్రాక్ పై ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటనపై రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా ఆల్కట్ తోటకు చెందిన రేగుళ్ల అరుణ్ కుమార్(22) రాజమహేంద్రవరం బాలాజీ పేట రైల్వే ట్రాక్ పై అనుమానాస్పదంగా మృతి చెందాడు. అతను అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తుండగా.. ఇటీవల ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో యువకుడిని చంపుతామని బెదిరించారని.. అరుణ్ కుమార్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు వారే తమ కుమారుడిని హతమార్చి రైల్వే ట్రాక్పై పడేశారని ఆరోపిస్తున్నారు. కాగా అరుణ్ కుమార్ తండ్రి 12 ఏళ్ల క్రితం చనిపోవడంతో తల్లి కేటరింగ్ పని చేస్తూ తన ముగ్గురి పిల్లల్ని పోషిస్తోంది. మృతదేహం, తలపైన మూడు చోట్ల గాయాలుండడం, అలాగే నొసటి పైనా గాయం ఉండడం, కాలిపై నుంచి రైలు చక్రం ఎక్కి నుజ్జునుజ్జుకావడంతో బంధువులు ఆ యువకుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.