పార్లమెంటు సాక్షిగా ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీ నేతలను ఇరకాటంలో పెట్టాయి. ఓ వైపు రాష్ట్రంలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఈ సారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న ధీమాతో ఉన్న బీజేపీ నేతలకు ప్రధాని మోడీ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ను పొగడ్తలతో ముంచెత్తి స్థానిక నేతలను గందరగోళంలోకి నెట్టారు. దీంతో ఇప్పుడు తామెలా వ్యవహరించాలో అర్ధంకాక అయోమయంలో పడ్డారు తెలంగాణ బీజేపీ నేతలు.
ఓ వైపు తెలంగాణలో జనచైతన్య యాత్రల పేరుతో బీజేపీ నేతలు ఊరూ వాడా తిరిగి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ సర్కార్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. నాలుగేళ్లలో కేసీఆర్ చేసిందేమీలేదని మండిపడుతున్నారు. కుటుంబ పాలనకు తాము చరమగీతం పాడతామని చెబుతున్నారు. అయితే, ఇప్పుడు ప్రధాని మోడీ... సీఎం కేసీఆర్ను పొగడటాన్ని తెలంగాణ బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఢిల్లీ పెద్దలు తమ విధానాలకు వ్యతిరేకంగా వ్యహరించడంపై లోలోన మదనపడుతున్నారు. మరి జనచైతన్య యాత్రలను తెలంగాణ బీజేపీ నేతలు ఎలా పున:ప్రారంభిస్తారు..? కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా వ్యవహరిస్తారన్నది వేచిచూడాలి.