కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఆలోచన ముందుకు సాగుతుందా.? మూడో కూటమికి ఎవరెవరు కలిసొస్తారు.? 2019 ఎలక్షన్స్ నాటికి బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలన్నింటిని కేసీఆర్ ఏకం చేస్తారా.? ఎన్నికల నాటికి ఇండియాలో కనిపించే పిక్చర్ ఏంటి.?
సీఎం కేసీఆర్ డిసైడ్ అయిపోయారు. త్వరలోనే.. బీజేపీ, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ తీసుకురాబోతున్నారు. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రకటనకు.. వివిధ రాష్ట్రాల నేతలు మద్దతు పలికారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. కేసీఆర్కు ఫోన్ చేసి మూడో కూటమి ప్రకటనను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. మీ వెంటే మేముంటాం అని చెప్పినట్లు కేసీఆర్ చెప్పారు. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్తో పాటు కొందరు మహారాష్ట్ర ఎంపీలు కూడా థర్డ్ ఫ్రంట్కు మద్దతు పలికినట్లు చెప్పారు కేసీఆర్.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం.. దేశంలో థర్డ్ ఫ్రంట్ రావాల్సిన అవసరముందన్నారు. కేసీఆర్ మూడో కూటమి ఆలోచనను స్వాగతిస్తున్నామన్న ఆయన.. ఫ్రంట్కు జనసేన తరఫున మద్దతు తెలిపారు. కేసీఆర్కు థర్డ్ ఫ్రంట్ లీడ్ చేసే సామర్థ్యం ఉందన్నారు పవన్ కల్యాణ్. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా కేసీఆర్ తీసుకురాబోయే మూడో కూటమికి మద్దతు పలికారు.
కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ స్టేట్మెంట్ వచ్చిన కొన్ని గంటల్లోనే.. దేశంలోని వివిధ రాష్ట్రాల నాయకులు మద్దతు పలికారు. ఇదంతా చూస్తుంటే.. త్వరలోనే కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ మూడో కూటమికి సపోర్ట్ చేసేందుకు ముందుకు వస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.