ముందస్తుకు ముహుర్తం ఫిక్స్ అయింది. రేపు (గురువారం) రోజునే అసెంబ్లీ రద్దుకు రెడీ అయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్. కేబినెట్ భేటీలో తీర్మానం చేసి..ఆ తీర్మానాన్ని తానే స్వయంగా గవర్నర్ కు అందించనున్నారు. మరోవైపు ముందస్తు ఎన్నికలపై తమకు ఎలాంటి సమాచారం లేదని సీఈఓ రజత్కుమార్ స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా ముసాయిదాపై మాత్రమే అఖిలపక్ష నాయకులతో చర్చలు జరగాయని తెలిపారు. ఇక ముందస్తుపై మంత్రివర్గాన్ని, ఎమ్మెల్యేలను మానసికంగా సిద్ధం చేశారు కేసీఆర్. పాలనపరంగా బుధవారమే దాదాపుగా ఆఖరు కావటంతో ఉన్నతాధికారుల బదిలీలు, కీలకమైన వారికి ముఖ్య బాధ్యతల అప్పగింతల అంశాలపై ఈ రాత్రికల్లా కసరత్తు పూర్తి చేసే అవకాశాలున్నాయి. మరోవైపు ఇవాళే ఆఖరు అని తెలిసి రాష్ట్ర హోమ్ గార్డులు ప్రగతిభవన్ వద్దకు చేరుకుని తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇక కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం గురువారం ఉదయం 6.45 గంటలకు రద్దయ్యే అవకాశం ఉంది. రేపు ఉదయం 6 గంటలకు చివరి కేబినెట్ సమావేశం జరగనున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే నేడు రాష్ట్ర చరిత్రలో మరపురాని ఘట్టం చోటుచేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ రద్దు చేస్తే రాష్ట్రం ఏర్పడి.. పాలనాపరంగా ఐదేళ్లు కూడా పూర్తిచేసుకొని రాష్ట్రంగా తెలంగాణ నిలిచిపోనుంది.