సీఎం కేసీఆర్ ద‌ట్టీల ర‌హ‌స్యం

Update: 2018-02-19 05:29 GMT

సీఎం కేసీఆర్‌కు నమ్మకాలు ఎక్కువ. ఏదైనా కార్యాన్ని తలపెట్టినప్పుడు ఆయన కుడి చేతికి దట్టి కట్టించుకుంటారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి దీన్ని ఆయన ప్రత్యేక సెంటిమెంట్ గా భావిస్తున్నారు. దర్గాల్లో ప్రత్యేక పూజలు చేసి తీసుకొచ్చే దట్టిలను కట్టుకుంటే ఓటమి దరి చేరదని కేసీఆర్ బలంగా నమ్ముతారు. కార్య సాధనలో, సంకల్ప సిద్దిలో దట్టిల పాత్ర ఆమోఘమని కేసీఆర్ నమ్మకం. అందుకే పుట్టిన రోజు సందర్బంగా ప్రగతి భవన్ లోని మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన కేసీఆర్..దట్టితో ప్రజలను కలుసుకున్నారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నమ్మకాలు చాలా ఎక్కువ. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తన నమ్మకాలను వదులుకోరు. కొన్ని సార్లు ఆ నమ్మకాలు తనకు రాజకీయంగా నష్టం చేసినా పట్టించుకోరు. ఎంత అత్యవసరమైనా ఆయన మంగళవారం నాడు ప్రయాణాలు మొదలు పెట్టరు. చివరి అంకె సున్న అశుభానికి సంకేతామని భావించే కేసీఆర్ షాదిముభారక్, కల్యాణ లక్ష్మిల మొత్తాన్ని 75 వేలు కాకుండా మరో 116 రూపాయలు జోడించి 75 వేల 116 ఖరారు చేసారు. దీంతో పాటు అంకె 6 అంటే ఆయనకు సెంటిమెంట్ ఎక్కువ. ఆయన వాడే వాహనాల నెంబర్లు కూడా 6 సంఖ్యతోనే ఉంటాయి. రైతు సమన్వయ సమితిలో గ్రామ స్థాయి నుంచి రాష్ట స్థాయి వరకు సభ్యుల సంఖ్యను 6 వచ్చే విధంగా ఖరారు చేసారు. మరో వైపు వాస్తును సీఎం కేసీఆర్‌ ఎంత ఆభిమానిస్తారు. సచివాలయం వాస్తు సరిగా లేదని పాలనను సచివాలయం నుంచి కాకుండా ప్రగతి భవన్ నుంచే చేస్తున్నారు. 

అయితే అన్ని మతాలను అభిమానించే కేసీఆర్..ఇతర మతస్తుల నమ్మకాలను గౌరవించడమే కాకుండా కొన్నింటిని అనుసరిస్తారు కూడా. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఆయన తన కుడి చేయికి దట్టిని ధరిస్తారు. ఏ కార్యాన్ని తలపెట్టినా దట్టి లేకుండా బయలు దేరరు. హిందూ ముస్లింల మత సామరస్యానికి ప్రతీకలైన దర్గాల్లో ప్రత్యేక పూజలు చేసి తెచ్చే దట్టిలు చాలా పవర్ ఫుల్ అని కేసీఆర్ నమ్ముతారు. మతగురువుల సమాధులైన దర్గాల వద్ద జరిగే ప్రార్థనా కార్యక్రమాలలో మతబేధం లేకుండా అందరూ పాల్గొంటారు. అందుకే దట్టీలకు మతాలను అపాదించకుండా విజయాన్ని కలిగిస్తాయన్న నమ్మకంతో కేసీఆర్ దట్టీలను ధరించేందుకు ఇష్టపడతారు. 

తెలంగాణ ఉద్యమ కాలంలో పాదయాత్రలు చేసినా, బహిరంగ సభలు నిర్వహించినా, ఉద్యమాలు చేసినా, ఢిల్లీకీ బయలు దేరిన సమయం ఇలా ఏ సమయమైనా ముస్లిం మత పెద్దలో లేక పార్టీ ముస్లిం నాయకులో ఖచ్చితంగా ఆయనకు దట్టి కట్టాల్సిందే. పార్టీ వీడక ముందు వరకు మాజీ ఎమ్మెల్సీ రహమాన్ దట్టి కడుతూ ఉండేవారు. ఆయన తర్వాత ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ చేత కేసీఆర్ దట్టీలు ధరిస్తున్నారు. అయితే  కేసీఆర్ ధరించే దట్టీలు ఎరుపు రంగులో ఉంటాయి. ఇవి నర ద్రుష్టిని నివారించడంతో పాటు అపజయాన్ని దరిచేరనీయవమని కేసీఆర్ నమ్ముతారు. సూఫీ మత గురువుల గుర్తుగా ఉన్న దర్గాల్లో లభించే దట్టీలకు హిందువుల కంకణాలంతా ప్రాధాన్యముంది. అందుకే విజయూ భవ..దిగ్విజయూ భవ అని ఆశీర్వదించే దట్టీలను కేసీఆర్ ప్రాణ ప్రదంగా భావిస్తారు. అందుకే తన పుట్టిన రోజు నాడు కూడా ఆయన దట్టీలతోనే ప్రజలను కలుసుకున్నారు. 

Similar News