టీడీపీ ఖాతాలోకి మరో ఎమ్మెల్సీ

Update: 2017-12-29 13:42 GMT

టీడీపీ ఖాతాలోకి మరో ఎమ్మెల్సీ స్థానం చేరింది. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థి కేఈ ప్రభాకర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఊహించినట్లుగానే కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కేఈ ప్రభాకర్ ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ రోజు ఊహించని సీన్ జరగటంతో టీడీపీ అకౌంట్‌లోకి మరో ఎమ్మెల్సీ సీటు వచ్చి చేరింది. టీడీపీకీ పోటాపోటీగా బరిలోకి దిగిన ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో కేఈ ఎన్నిక లాంఛనమైంది.

ఈ ఎన్నిక నుంచి వైసీపీ తప్పుకొని వ్యూహాత్మకంగా ఇండిపెండెంట్లకు మద్దతు ప్రకటించడంతో పోటీ కాస్త రసవత్తరంగా మారిందనుకున్నారంతా. కానీ స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో సీన్ మారిపోయింది. టీడీపీ గెలుపు ఊహించిందేనని ఆ పార్టీ  జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ ఎన్నిక లాంఛనమవడం శుభపరిణామమని తెలిపారు. కేఈ ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తల సంబరాలు కర్నూలులో అంబరాన్నంటాయి.
 

Similar News