2026 కల్లా వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి : మంత్రి నిమ్మల
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులు మీదుగా భూమి పూజ చేసుకున్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులు 2026 కి పూర్తి చేయాలని పట్టుదలతో పని చేస్తున్నట్లు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.
దోర్నాల: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులు మీదుగా భూమి పూజ చేసుకున్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులు 2026 కి పూర్తి చేయాలని పట్టుదలతో పని చేస్తున్నట్లు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ప్రకాశం జిల్లా-దోర్నాల సమీపంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టన్నెల్ లో 18 కి.మీ. లోపలి వరకు శుక్రవారం ఆయన ప్రయాణించి, క్లిష్టమైన లైనింగ్ పనులు పరిశీలించారు.
ఈ సందర్భంగా స్థానిక రైతులతో కలసి ప్రాజెక్టు పనుల పురోగతిపై ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పరిధిలో ఇప్పుడు జరుగుతున్న పనులతో పాటు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ వరకు పూర్తి చేయడానికి మరో మూడు నుంచి నాలుగు వేల కోట్లు అవసరమవుతాయని మంత్రి స్పష్టం చేశారు. ఇన్ని పనులు ఉండగా, ఈ ప్రాజెక్టు పూర్తయిపోయిందని, జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేయడం ఎంత విడ్డూరమో ఆలోచించాలన్నారు. రాష్ట్ర చరిత్రలో దగాకి, మోసానికి జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని మంత్రి నిమ్మల ఎద్దేవా చేశారు. వెలిగొండ ప్రాజెక్టు లో జగన్ చేసిన తప్పిదాలు మోసం, దగా, జిల్లా రైతులకు తెలియాలనే రైతులతో కలసి సమీక్ష నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హెడ్ రెగ్యులేటర్లో 2200 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేశామని ఆయన స్పష్టం చేశారు. 18 నెలల కాలంలోనే టన్నెల్స్ లో క్లిష్టమైన 3 కి.మీ లైనింగ్ పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం 4 గ్యాంట్రీలతో రోజుకు 12 మీటర్ల లైనింగ్ పనులు చేస్తుండగా, గ్యాంట్రీల సంఖ్యను పెంచి లక్ష్యం మేరకు పనులు పూర్తి చేయాలని ఏజెన్సీని ఆదేశించామని ఆయన అన్నారు. ఫీడర్ కెనాల్ లో 45వేల క్యూబిక్ మీటర్ల హార్డ్ రాక్ పనులు చేయాల్సి ఉండగా, ఇప్పటికే 28వేల క్యూబిక్ మీటర్లు పనులు పూర్తి చేసినట్లు వివరించారు.