చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీషాగౌడ్, రేణిగుంట తహసీల్దార్ నరసింహులునాయుడులపై నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు. రాస్కెల్.. నీవెంత, నీ ఉద్యోగం ఎంత, నువ్వు నాకు చెప్పేవాడివా అంటూ తహసీల్దార్పై చిందులు తొక్కారు. నీ అంతు చూస్తానంటూ జాయింట్ కలెక్టర్ను హెచ్చరించారు. తిరుపతి విమానాశ్రయానికి గురువారం కర్ణాటక సీఎం కుమారస్వామి రాక సందర్భంగా.. తన విషయంలో ప్రొటోకాల్ పాటించలేదని ఆయన చిత్తూరు జిల్లా అధికారులపై మండిపడ్డారు. అక్కడున్న జేసీ గిరీష, రేణిగుంట తహసీల్దార్ నరసింహులు నాయుడిపై ఒంటికాలిపై లేస్తూ వార్నింగ్లు ఇచ్చారు. కాగా, ఎమ్మెల్యే తీరును అధికార యంత్రాంగం తీవ్రంగా ఖండించింది. శుక్రవారం ఉదయం 10గంటల్లోపు బేషరతుగా క్షమాపణ చెప్పకుంటే రెవెన్యూతోపాటు అన్నిశాఖల సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తారని జిల్లా రెవెన్యూ అసోసియేషన్, ఏపీజేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ విజయసింహారెడ్డి, కార్యదర్శి అమర్నాథ్ హెచ్చరించారు.