తెలుగు ఐటమ్ సాంగ్స్లో ఒకప్పుడు ఉత్తరాది భామలు ఆడిపాడేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. స్పెషల్ సాంగ్స్ కోసం వాళ్లనో, వీళ్లనో దింపడం ఎందుకనే భావనకు దర్శకనిర్మాతలొచ్చారు. సినిమాకు ఏ మాత్రం సంబంధం లేని మరో హీరోయిన్తో స్టెప్పులేయించడం ఈ మధ్య టాలీవుడ్లో కనిపిస్తున్న సీన్. ఇప్పుడు ఇదే సీన్ జైలవకుశ సినిమాలో రిపీట్ కాబోతోంది. జైలవకుశ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ చేయబోతోంది. ఈ పాటను చిత్ర యూనిట్ ఆడియోతో పాటు విడుదల చేయలేదు. ఇవాళ సాయంత్రం 5.40 నిమిషాలకు పాటను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఈ పాటలో తమన్నా ఎలా ఉండబోతోందో ఒక పోస్టర్తో చెప్పకనే చెప్పేశారు. తమన్నా పాటకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్ ఈ సాంగ్పై అంచనాలను మరింత పెంచింది.
ఎన్టీఆర్ మూడు పాత్రల్లో మెప్పించడమే ఒక పండగగా భావించిన ఫ్యాన్స్ ఇప్పుడు తమన్నాను చూసి ఉబ్బితబ్బిబవుతున్నారు. స్వింగ్ జరా అంటూ సాగే ఈ పాటలో తమన్నా చిందేయనుంది. దేవీశ్రీ ప్రసాద్ స్పెషల్ సాంగ్స్ ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తమన్నా స్పెషల్ సాంగ్లో మెప్పించడం కొత్తేమీ కాదు. అల్లుడు శీను సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్తో కలిసి స్టెప్పులేసింది. ఇప్పుడు తారక్తో కలిసి స్పెషల్ సాంగ్లో కనిపించబోతోంది. ఎన్టీఆర్, తమన్నా కాంబినేషన్లో వచ్చిన ఊసరవెల్లిలో దాండియా సాంగ్ కూడా దాదాపు ఐటమ్ సాంగ్లానే ఉంటుంది. ఎన్టీఆర్ కూడా జనతా గ్యారేజ్లో కాజల్తో పాటు డ్యాన్స్ చేసి మెప్పించిన సంగతి తెలిసిందే.