అనుమానం పెనుభూతమైంది. దీంతో కట్టుకున్న భార్యను గొంతుకోసి ఆపై తాను ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన కర్నూల్ మిడుతూరులో జరిగింది. మిడుతూరుకు చెందిన ఎస్తేరి(30)తో గార్గేయపురానికి చెందిన కృష్ణ(35)కు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కూలిపనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్న వీరిమధ్య కొన్నాళ్లుగా విబేధాలు వచ్చాయి. ఈ క్రమంలో కృష్ణ తన భార్యను వేధించడం మొదలు పెట్టాడు. భర్త వేధింపులు తాళలేక ఎస్తేరి తన పుట్టిల్లు మిడుతూరుకు వెళ్ళింది. కొంతకాలంగా వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతోందన్న అనుమానం చెందాడు కృష్ణ. ఇదే విషయమై ఇటీవల దంపతులిద్దరూ గొడవపడ్డారు. దీంతో ఆవేశానికి లోనైనా కృష్ణ కత్తితో భార్య గొంతుకోశాడు. ఆపై కొంతసేపటికి భార్య చనిపోతుందేమోనన్న భయంతో ఆపై తాను కూడా అదే కత్తితో గొంతుకోసుకున్నాడు. కుటుంబసభ్యులు గమనించి వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యం చేయడంతో ఇద్దరికీ ప్రాణాపాయం తప్పింది. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.