హైదరాబాద్, ముషీరాబాద్ లో ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పద్మశాలీకాలనీకి చెందిన శ్రీనివాస్, నాగమణి దంపతులకు కూతురు ఉషశ్రీ, కుమారుడు మహేశ్(12) ఉన్నారు. కవాడిగూడ లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో మహేశ్ 7వ తరగతి చదువుతున్నాడు. తల్లి నాగమణి బయటకు వెళ్ళింది. ఊరికి వెళ్లిన శ్రీనివాస్ ఇంటికి రాగా తాళం వేసి ఉంది. మహేశ్ వద్దనున్న తాళం చెవి కోసమని అతడు స్కూల్కు వెళ్లాడు.అయితే మహేశ్ 2 రోజుల నుంచి స్కూలుకు రావడంలేదని యాజమాన్యం చెప్పింది. ఇంటికి చేరుకున్న మహేష్ ను అడగగా ఫీజు కట్టాలని టీచర్లు అందరిముందు అడుగుతున్నారని, అందుకే వెళ్లలేదని చెప్పాడు. కొద్దిసేపటికి బయటకు వెళ్లిన శ్రీనివాస్ తిరిగి ఇంటికి వచ్చేసరికి లోపల గడియపెట్టి ఉంది. తలుపులు పగులకొట్టి లోనికి వెళ్లి చూడగా సీలింగ్ ఫ్యాన్కు మహేశ్ వేలాడుతూ కనిపించాడు. దీంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మహేష్ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. రోజు లాగే ఫీజు కట్టలేదని స్కూల్ యాజమాన్యం వేధించడంతోనే తమ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.