జనసేనాని ఈ సారి కొంచెం డిఫరెంట్‌

Update: 2018-01-21 08:10 GMT

పవన్‌ కల్యాణ్...కొండగట్టు నుంచి యాత్ర ప్రారంభించడానికి కారణాలేంటీ ? యాత్ర చేయడానికి ఎవరి నుంచి స్ఫూర్తి పొందారు ? ఆంజనేయస్వామి మీద ఉన్న భక్తే యాత్రకు కారణమా ? ఏపీలో అనేక సమస్యలపై గళమెత్తిన పవన్‌...తెలంగాణలోనూ ప్రజా సమస్యలపై గళమెత్తుతారా ? లేదంటే పొలిటికల్ యాత్రతోనే సరిపెట్టుకుంటారా ? 

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్...యాత్రకు రెడీ అయ్యారా ? అయితే ఈ సారి కొంచెం డిఫరెంట్‌. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లోనే పర్యటించిన జనసేనాని....ప్రజా సమస్యలపై గొంతెత్తారు. ఉద్ధానం కిడ్నీ బాధితుల గోడు, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల గాథలు, రాజధాని రైతుల బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. పవన్‌ పోరాటంతో ఉద్దానంలో ప్రభుత్వం డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. ప్రశ్నిస్తానంటూ జనసేన పార్టీని ఏర్పాటు చేసిన పవన్‌ కళ్యాణ్‌....తెలంగాణలోనూ ప్రజా సమస్యలపై గొంతెత్తుతారా ? ప్రజా సమస్యలపై పోరాటం చేస్తారా ? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 

క్యూబా విప్లవ కెరటం చేగువేరా జీవితం నన్ను ఎంతగానో ప్రభావితం చేసిందంటారు పవన్‌ కల్యాణ్. ఆయనే నాకు స్ఫూర్తి. లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ్‌, నారాయణ్‌ గురు, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌లు నాకు ఆదర్శమనే జనసేనాని సాధ్యమైనంతవరకు వీరి అడుగుజాడల్లో నడిచేందుకు ప్రయత్నిస్తానని పలు సందర్బాల్లో చెబుతారు. చే గువేరాను ఆరాధించే పవన్‌ కల్యాణ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజల విముక్తి కోసం 1965లో క్యూబాని వదిలారు. కనగో, బొలివియా దేశాల ప్రజల విముక్తి కోసం పోరు బాట పట్టారు. ఇపుడు ఆయన బాటలోనే పవన్‌ కల్యాణ్‌ కూడా తెలంగాణ ప్రభుత్వంపై పోరాటం చేస్తారన్న దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రజల సమస్యల గురించి పట్టించుకోని పవన్‌...ఉన్నట్టుడి యాత్ర ప్రారంభించడం వెనుక అంతర్యమేంటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయ్. 

మల్లన్న సాగర్‌ నిర్వాసితుల పోరాటం, నల్గొండలో ఫ్లోరైడ్, పాలమూరు వాసుల వలసల వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయ్. వీటన్నంటిపై ముందు గళమెత్తి....తర్వాత పొలిటికల్ యాత్ర చేసే ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రమాదం నుంచి బయటపడటంతోనే కొండగట్టు నుంచి యాత్ర ప్రారంభిస్తున్నట్లు చెబుతున్న జనసేనాని...బయటకు కనిపించని పొలిటికల్ ఏజెండా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్. 

Similar News