ఫాతిమా కాలేజీ విద్యార్థుల సమస్య పరిష్కారమయ్యే వరకు వారికి అండగా ఉంటానని జనసేన అధినేత పవన్ కల్యాన్ హామీ ఇచ్చారు. తనను కలిసిన ఫాతిమా కాలేజీ విద్యార్థల సమస్యను అడిగి తెలుసుకున్న పవన్ ప్రభుత్వం ప్రకటించిన ఆర్డినెన్స్ అమలయ్యే విధంగా తాను కృషి చేస్తానని చెప్పారు. ఫాతిమా మెడికల్ కళాశాలకు 2015 విద్యా సంవత్సరానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వంద మంది విద్యార్థులు రోడ్డున పడిన సంగతి తెలిసిందే. తమకు న్యాయం చేయమని మూడేళ్లుగా ప్రయత్నం చేసి నిరాశ, నిస్పృహలకు గురైన విద్యార్థులు ఇటీవల పవన్ కల్యాణ్ను కలసి విజ్ఞప్తి చేయడంతో, ఆయన విద్యార్థులకు బాసటగా నిలిచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిథులతో ఈ సమస్యపై మాట్లాడుతున్నారని జనసేన ప్రెస్నోట్లో పేర్కొంది. కాగా, ఇటీవలే చంద్రబాబు నాయుడి ప్రభుత్వం దీనిపై ఆర్డినెన్సును విడుదల చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది.