‘అమరజీవి జలధార’ ద్వారా 5 జిల్లాలకు రూ. 7,910 కోట్లు
‘అమరజీవి జలధార’ ద్వారా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల పరిధిలో 7,910 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు.
నిడదవోలు: ‘అమరజీవి జలధార’ ద్వారా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల పరిధిలో 7,910 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో జరిగిన “అమరజీవి జలధార” శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘‘ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే 35 ఏళ్లలో 1.21 కోట్ల మంది దాహర్తి తీర్చాలని సంకల్పించాం. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీర ప్రాంతం వెంబడి నివసించే మత్స్యకార సోదరులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ శాతం తీర ప్రాంతాలను కలిపేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. 2027 నాటికి పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం.’’ అని పవన్ కళ్యాణ్ చెప్పారు.
‘‘తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం అమరుడైన శ్రీ పొట్టి శ్రీరాములుని సదా స్మరించుకోవాలనే ఉద్దేశంతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు “అమరజీవి జలధార”గా నామకరణం చేశాం. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో భూగర్భ జలాలు కలుషితమైపోయాయి. స్వచ్ఛమైన తాగు నీరు కావాలంటే డబ్బు పోసి కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది. మళ్లీ మేము అధికారంలోకి వస్తాం. మీ అంతు చూస్తాం అని కొంతమంది వైసీపీ నాయకులు బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నారు. పనులు చేస్తే కాంట్రాక్టర్లను జైల్లో పెడతామని బెదిరిస్తున్నారు. వారందరికీ ఒకటే చెబుతున్నాం. మీకు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంటే కరెక్ట్. ప్రభుత్వం తలుచుకుంటే బలమైన నక్సలిజమే కకావికలం అయిపోయింది. ఇలా బెదిరింపులకు దిగే కిరాయి రౌడీలకు ప్రభుత్వం బలమైన పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి.’’ అని డిప్యూటీ సీఎం అన్నారు.