ఆన్లైన్ షాపింగ్ వినియోగం భారీగా పెరిగింది. కొత్తకొత్త కంపెనీలు ఈ-కామర్స్ రంగంలో రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. వాటిలో వినియోగదారులను మోసగించే ఫ్రాడ్ కంపెనీలు కూడా ఉంటున్నాయి. అయితే ఆన్లైన్ షాపింగ్ రంగంలో దూసుకుపోతున్న అమెజాన్ కూడా తాజాగా ఓ వినియోగదారుడికి షాకిచ్చింది. ఫోన్ ఆర్డర్ చేస్తే డిటర్జెంట్ పౌడర్లు పంపించి విమర్శల పాలవుతోంది. అయితే తప్పు ప్యాకింగ్ సెక్షన్లో జరిగిందా.. ఆ తర్వాత డెలివరీ బాయ్ ఏమైనా గ్యాంబ్లింగ్ చేశాడా అన్న విషయం తేలాల్సి ఉంది. ఢిల్లీకి చెందిన చిరాగ్ అమెజాన్లో ఈ నెల 7న వన్ప్లస్ 5 స్మార్ట్ఫోన్ను బుక్ చేశాడు. నగదును కూడా ఆన్లైన్లోనే చెల్లించాడు. సెప్టెంబర్ 11వ తేదీ చిరాగ్ పార్శిల్ అందుకున్నాడు.
అందులో ఫోన్కు బదులు డిటర్జెంట్ పౌడర్ కనిపించడంతో కంగుతిన్నాడు. ఫోన్ బాక్స్ అయితే ఉంది కానీ అందులో డిటర్జెంట్ పౌడర్ ప్యాకెట్స్ కనిపించడంతో చిరాగ్ షాకయ్యాడు. ఎందుకిలా జరిగిందో కనుక్కోవడానికి అమెజాన్ కస్టమర్ కేర్ను సంప్రదించగా.. ఆశించిన సమాధానం రాలేదు. చిరాగ్ చిరాకొచ్చి అమెజాన్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎట్టకేలకు అతనికి వన్ ప్లస్ 5 స్మార్ట్ఫోన్ను అమెజాన్ పంపింది. ఒక్క అమెజాన్ మాత్రమే కాదు మిగతా కంపెనీల వినియోగదారులు కూడా కొన్ని సార్లు మోసపోయి లబోదిబోమన్న సంగతి తెలిసిందే.