రాజమహేంద్రవరానికి చెందిన స్వీపర్ కోల వెంకటరమణమ్మ వేతనం అక్షరాలా లక్షన్నర రూపాయలు. వాట్సాప్లో షేర్ అవుతున్న ఆమె పే స్లిప్ను చూసి చాలామంది ఫేక్ అని కొట్టిపారేశారు. అయితే, అది ఫేక్ కాదని, ఆమె వేతనం రూ.1,47,722 అని తేలింది. ఆమె మాత్రమే కాదు.. ఆమెలా లక్షకుపైగా జీతం తీసుకుంటున్న వారు డిస్కమ్లలో చాలామందే ఉన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు విద్యుత్ శాఖలో సంస్కరణలు ప్రవేశపెట్టారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు పోయి జెన్కో, ట్రాన్స్కోలు ఏర్పడ్డాయి. ఫలితంగా ట్రాన్స్కోలో మళ్లీ ప్రాంతాల వారీగా డిస్కమ్లు ఏర్పాటు చేశారు. సంస్కరణల నేపథ్యంలో ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ ఇవ్వడాన్ని ఆపేశారు. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన తలెత్తింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల్లో భరోసా నింపేందుకు అప్పటి ప్రభుత్వం భారీ ఎత్తున వేతనాలు పెంచింది. ఇంక్రిమెంట్లు కూడా అదే స్థాయిలో నిర్ణయించింది. సంస్థలోని ఉద్యోగస్తులందరితో స్వీపర్లు కూడా మంచి జీతం పొందుతున్నారు. వారి జీతం ఐదెంకలు దాటి ఆరంకెల్లోకి చేరింది.
రాజమహేంద్రవరం తాడితోట ప్రాంతానికి చెందిన కోల వెంకటరమణమ్మ 1978లో 16వ ఏటనే విద్యుత్తు శాఖలో రోజువారీ ఉద్యోగిగా చేరారు. ఆమె తల్లి కూడా అక్కడే స్వీపర్గా పని చేసేవారు. 1981 ఏప్రిల్ 1న రమణమ్మ పర్మినెంట్ ఎంప్లాయ్ అయ్యారు. అప్పటి నుంచి రాజమహేంద్రవరం సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయంలోని విద్యుత్ చౌర్య నిరోధక విభాగంలోనే పని చేస్తున్నారు. ఇప్పటికే ఆమె సర్వీసు 40 ఏళ్లు దాటింది. రిటైర్మెంట్కు మరో నాలుగేళ్లు ఉంది. వెరసి… సుదీర్ఘ సర్వీసు కావడంతో జీతం కూడా భారీగా పెరుగుతూ వచ్చింది. మొత్తం జీతం 1,47,722 రూపాయలు! ఆమె మాత్రమే కాదు… ఇలా లక్షకు పైబడి జీతం తీసుకునే నాలుగో తరగతి ఉద్యోగులు డిస్కమ్లలో చాలామందే ఉన్నారు.