పర్యాటక రంగంలో సరికొత్త అధ్యాయం
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని దేశీయంగా అగ్రస్థానంలో నిలబెట్టే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని దేశీయంగా అగ్రస్థానంలో నిలబెట్టే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా (ADTOI) సహకారంతో 2026 ఫిబ్రవరి 13, 14 తేదీల్లో విశాఖపట్నం వేదికగా 'ఏడీటీవోఐ నేషనల్ టూరిజం మార్ట్ 2025' నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. వెలగపూడి సచివాలయం రెండవ బ్లాక్ లోని తన కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ బుధవారం పర్యాటక శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో ఏడీటీవోఐ ప్రతినిధులతో ఎంవోయూ (అవగాహన ఒప్పందం) కుదుర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ను దేశీయ పర్యాటక రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎంవోయూ కుదుర్చుకున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, అద్భుతమైన తీరప్రాంతం, మెరుగైన మౌలిక వసతులు కలిగిన విశాఖ నగరం ఈ జాతీయ స్థాయి ఈవెంట్కు ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమన్నారు. రాష్ట్రంలోని కోస్టల్ టూరిజం, ఆధ్యాత్మిక క్షేత్రాలు, చారిత్రక కట్టడాలు, ఎకో-అడ్వెంచర్ టూరిజం, ఏజెన్సీ ప్రాంతాల పర్యాటకాన్ని జాతీయ స్థాయిలో ప్రదర్శించడానికి ఇది ఒక గొప్ప వేదికని పేర్కొన్నారు.రెండు రోజుల పాటు జరిగే ఈ మార్ట్లో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ టూర్ ఆపరేటర్లు, హోటల్ యజమానులు, డెస్టినేషన్ ప్రమోటర్లు, పర్యాటక రంగ వాటాదారులు, ట్రావెల్ నిపుణులు పాల్గొంటారని తెలిపారు. ఈ ఈవెంట్ వల్ల బీ2బీ నెట్వర్కింగ్ సెషన్లు, గమ్యస్థానాల ప్రదర్శనలు, వ్యాపార సమావేశాలు, ప్యానెల్ చర్చలు, పర్యాటక ప్రాంతాల సందర్శన కార్యక్రమాల ద్వారా స్థానిక పర్యాటక వాటాదారులకు జాతీయ స్థాయిలో వ్యాపార సంబంధాలు ఏర్పడతాయని తాము భావిస్తున్నట్లు మంత్రి దుర్గేష్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అపారమైన, వైవిధ్యభరితమైన పర్యాటక అవకాశాలను ప్రదర్శించడానికి ఇదొక అద్భుతమైన వేదికగా నిలుస్తుందని వెల్లడించారు. ఈ చొరవ వల్ల రాష్ట్రానికి పర్యాటకుల రాక పెరగడమే కాకుండా, స్థానికులకు ఉపాధి అవకాశాలు, దీర్ఘకాలిక వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయని, జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ స్పెషల్ సెక్రటరీ అజయ్ జైన్, ఏపీటీఏ సీఈవో, ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాట, ఏపీటీఏ డిప్యూటీ సీఈవో శ్రీనివాస్, ఏపీ సృజనాత్మక సంస్కృతి సమితి చైర్ పర్సన్ తేజస్వి పొడపాటి, కమ్యూనికేషన్ ఆఫీసర్ పద్మారాణి, అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ వేద్ ఖన్నా, వైస్ ప్రెసిడెంట్ ఆశిష్, ట్రావెల్ మార్ట్ సీఈవో విజయ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.