పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రికార్డు డ్యాన్స్ అసభ్యకరంగా ఉందని ఏపీ మహిళా కమీషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి ఇలాంటి డాన్సులకు పర్మిషన్ ఇవ్వమని చెప్పారు. కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ తనపై చేసిన ఆరోపణలను తప్పుబట్టారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన వారికి మాట్లాడే అర్హతలేదని నన్నపనేని రాజకుమారి స్పష్టం చేశారు.
కాగా భీమవరం యూత్ క్లబ్ వార్షికోత్సవ కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్సుల నిర్వహణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొనటంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.
మరోవైపు ఏపీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీపై నన్నపనేని రాజకుమారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను సురభి నాటకాల కంపెనీ ఆర్టిస్టులతో పోల్చడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. నా అనుభవం అంతలేదు ఆమె వయస్సు. అన్ని పార్టీలవారు మహిళా కమిషన్ చైర్పర్సన్గా నా పనితీరును అభినందిస్తున్నారు. పద్మశ్రీకి దమ్ము, ధైర్యం ఉంటే తనతో బహిరంగ చర్చకు రావాలి. విశాఖ జిల్లా పెందుర్తిలో దళిత మహిళపై జరిగిన దాడిని ఖండిస్తున్నా. ఆమెను పరామర్శించి, ప్రభుత్వ హామీ అమలు జరిగేలా చర్యలు తీసుకుంటా’ అని తెలిపారు.