తనపై భర్త అనుమానపడుతున్నాడని భార్య నడిరోడ్డుపై దారుణానికి పాల్పడింది. భార్య భర్తల మధ్య ఘర్షణ చివరకు కూతురు ప్రాణాలమీదకు తెచ్చింది. హైదరాబాద్ నగరంలోని మెహదీపట్నం బస్టాండ్ వద్ద సోమవారం రాత్రి కలకలం రేగింది. అక్రమ సంబంధం పేరిట భార్యను భర్త అనుమానించడంతో దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈక్రమంలో బిడ్డ తనకు పుట్టలేదంటూ అనుమానించాడు భర్త.. దీంతో నడిరోడ్డుపైనే ఘర్షణకు దిగింది భార్య. పైగా భర్తపై కోపంతో తన చేతిలోని చిన్నారిని నేలకేసి కొట్టింది. దీంతో పాప గుక్కపట్టి ఏడ్చింది. తనపై కోపం చిన్నారిపై చూపడమేంటని భర్త ఆమెపై చేయిచేసుకోవడంతో.. గొడవ మరింత ఎక్కువైంది. ఇదంతా అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుల కంటబడింది. పోలీసులు భార్యాభర్తలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించి అక్కడ నుంచి పంపించారు. వీరి ఘర్షణ కారణంగా కాసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.