మరికొద్ది సేపట్లో పెళ్లి జరుగుతుందనగా వరుడిపై లైంగికదాడి కేసు నమోదయింది. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా, శోభనాద్రిపురం గ్రామానికి చెందిన యువతి సేల్స్ గర్ల్గా పనిచేస్తూ
జూబిలీహిల్స్ , ఇందిరానగర్లో నివాసం ఉండేది. ఆమెకు కరీంనగర్ కు చెందిన ఆకుల నరేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. దాంతో అది ప్రేమకు దారితీసింది.
ఈ క్రమంలో కొన్నేళ్లుగా ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. యువతి పలుమార్లు పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు దాటవేయడమేగాక గత జూన్లో ఆమెకు అబార్షన్ చేయించాడు. అయితే ఇటీవల నరేష్ ఫోన్లో ఓ యువతి ఫొటోను చూసి నిలదీయగా ఆమె తన సోదరి అంటూ బుకాయించాడు నరేష్. దీంతో అనుమానం వచ్చి అతడి స్నేహితులను ఆరా తీయగా, అతడికి మరో యువతితో పెళ్లి కుదిరిందని, ఈనెల 30న కరీంనగర్లో పెళ్లి జరుతుతున్నట్లు తెలిపారు. మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం కల్యాణ మండపానికి చేరుకున్న యువతి పెళ్లి నిలుపుదల చేయించింది. ప్రస్తుతం కేసు దర్యాప్తు సాగుతోంది.