ప్రణయ్ హత్యకు నిరసనగా ప్రజా సంఘాల ఆద్వర్యంలో మిర్యాలగూడలో బంద్ పాటిస్తున్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు మూసివేశారు. పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గితే సహించబోమని రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
పరువు హత్యపై నిరసనలు భగ్గమంటున్నాయ. ప్రణయ్ హత్యా ఘటనతో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందో బస్తు ఏర్పాటు చేశారు. ప్రణయ్ హత్య కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న మారుతీరావు పరారీలో ఉన్నాడు. మర్డర్ ఘటనకు గంటన్నర ముందే హైదరాబాద్ పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. మాడ్గులపల్లి టోల్ ప్లాజ్ వద్ద 12 గంటల 18 నిమిషాలకు మారుతిరావు ప్రయాణిస్తున్న ఫార్చునర్ వాహనం టోల్ ప్లాజా దాటినట్లుగా సీసీ టీవీ ఫుటేజ్ లో దృష్యాలను పోలీసులు గుర్తించారు. ఏ-2 నిందితుడు శ్రవణ్ తో పాటు హత్యలో పాల్గొన్న ఇతర నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు హైదరాబాద్ వెళ్లాయి. ప్రణయ్ హత్యా ఘటనతో శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు అమెరికాలో ఉన్న ప్రణయ్ సోదరుడు వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.