హైదరాబాద్ మెట్రో రైల్కు ప్రయాణికుల సందడి తగ్గిందా ? మెట్రో రైల్ ప్రారంభమై...మూడు నెలలు కూడా పూర్తి కాలేదు. జనం లేక స్టేషన్లు వెలవెలబోతున్నాయా ? స్టేషన్లలో ప్రయాణికులు అంతంతమాత్రంగానే కనిపిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో....మెట్రో రైల్ ఉద్యోగులపై వేటు పడే అవకాశముంది.
ముచ్చటగా మూడు నెలలు కూడా పూర్తి కాలేదు...మెట్రో రైల్ ప్రారంభమై. ప్రయాణికులు లేక స్టేషన్లన్ని వెలవెలబోతున్నాయ్. మొదట్లో జాయ్ రైడ్స్ మినహాయిస్తే...మెట్రో రైల్ ఎక్కేందుకు జనం వెనుకంజ వేస్తున్నారు. బస్స్ చార్జ్ కంటే మెట్రో రైల్ చార్జ్ ఎక్కువగా ఉంది. దీనికి తోడు మెట్రో స్టేషన్ల వద్ద వాహనాల పార్కింగ్...ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఒక వేళ రోడ్ల మీద పార్కింగ్ చేసే వెళ్తే...ట్రాఫిక్స్ పోలీసులు ఫైన్ల మీద ఫైన్లు వేస్తున్నారు. దీంతో మెట్రో రైల్లో వెళ్లడం కంటే బస్సుల్లోనే ఆఫీస్లకు వెళ్లడం మంచిదని నగరవాసులు భావిస్తున్నారు. మెట్రో రైల్లో ప్రయాణించే వారి సంఖ్య ఘోరంగా పడిపోవడంతో....ఈ ప్రభావం ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
చార్జీలతో పాటు ఇతర వనరుల ద్వారా భారీగా ఆదాయం దండుకోవాలన్నది ఎల్ అండ్ టీ కంపెనీ ఆలోచన. ఇందులో భాగంగా ఇప్పటికే మెట్రోకు యాడ్స్ పెరిగాయ్. మాల్స్ రెడీ అవుతున్నాయ్. నిర్ణీత మార్గంలో మెట్రో రైలు కారిడార్ను నిర్మించడంతోపాటు ఆ మార్గంలోనే రియల్ ఎస్టేట్ ద్వారా ఆదాయం పొందేలా వందల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను నిర్మాణ సంస్థకు ఉదారంగా అప్పగించారు. నగర శివార్లలోనే కాదు.. నగరం నడిబొడ్డున, అత్యంత రద్దీ మార్గాలుగా గుర్తించిన పంజాగుట్ట, ఎర్రమంజిల్, హైటెక్ సిటీ, మియాపూర్, రాయదుర్గం, మలక్పేట- మూసారాంబాగ్ ప్రాంతాల్లోనే. ఏకంగా 290 ఎకరాల స్థలాన్ని 30 ఏళ్ల వరకు అనుభవించే హక్కును కల్పించింది ప్రభుత్వం. మెట్రో స్టేషన్లు, మెట్రో పిల్లర్లపై ప్రచార ప్రకటనల ఆదాయం దీనికి అదనం.
రియల్ ఎస్టేట్ ద్వారా 50 శాతం, యాడ్స్ ద్వారా 5 శాతం, టికెట్ల ద్వారా మిగిలిన 45 శాతం ఆదాయాన్ని పొందేలా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును డిజైన్ చేశారు. రియల్ ఎస్టేట్, ప్రకటనల ఆదాయం వేల కోట్లు వచ్చే అవకాశం ఉన్నా.. ఢిల్లీ మెట్రో కంటే మన దగ్గర ధరలు ఎక్కువ. బెంగళూరు, చెన్నై, ముంబై, కొచ్చి, జైపూర్.. ఇలా ఏ మెట్రో ప్రాజెక్టును తీసుకున్నా వాటికి మించిన ధరలు ఇక్కడున్నాయ్. దీంతో మూడు నెలలు గడవకముందే మెట్రో ప్రయాణం అంటేనే.. బాబోయ్ అనే పరిస్థితి వచ్చింది. ప్రజా రవాణాలో అత్యంత కీలకం దినసరి, నెలవారీ పాసులు. మూడు నెలలు గడుస్తున్నా ఉమ్మడి టికెట్, పాసుల ఊసే లేదు.