వివాదాస్పద ఆథ్యాత్మికవేత్త నిత్యానంద మరోసారి వార్తల్లోకి ఎక్కారు. నిత్యానంద ఆశ్రమం నుంచి తన భార్యను విడిపించాలంటూ తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి నమక్కల్ జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశాడు. రాశిపురం తాలూకా పట్టణం మునియప్పపాళయం ప్రాంతానికి చెందిన రైతు రామస్వామి. ఇతని భార్య అత్తాయి (50). రామస్వామి తన భార్య నిత్యానంద ఆశ్రమంలో ఉన్నారని, ఆమెను విడిపించాలని నామక్కల్ జిల్లా కలెక్టర్కు ఒక పిటిషన్ అందజేశారు. అందులో.. తన భార్య అత్తాయి, కుమారుడు పళనిస్వామి కొన్ని నెలల కిందట బెంగళూరులోని నిత్యానంద మఠానికి ధ్యానం చేసేందుకు వెళ్లారని, తర్వాత వారు తిరిగి రాలేదని తెలిపారు. దీనిపై నామక్కల్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశానని, పోలీసులు బెంగళూరుకు వెళ్లి తన కుమారుడు పళనిస్వామిని విడిపించి తనకు అప్పగించినట్లు తెలిపారు. కానీ, తన భార్య ఆచూకీ మాత్రం ఇంత వరకు తెలియరాలేదని వాపోయాడు.
తన భార్య పేరిట ఓ బ్యాంకులో రూ. 5 లక్షలు, ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో రూ. 5 లక్షలు, నగలపై రూ. 30 వేల రుణం, బయటి వ్యక్తుల వద్ద తీసుకున్న రుణాలు రూ. 11 లక్షల వరకు ఉన్నాయని... ఇదంతా ధ్యాన తరగతులకు ఖర్చు చేసినట్టు బాధితుడు తెలిపాడు. బ్యాంకు అధికారులు ఇంటికి వచ్చి అప్పు చెల్లించాలని వేధిస్తున్నారని... ఈ నేపథ్యంలో, గత ఎనిమిది నెలలుగా మానసిక వేదనను అనుభవిస్తున్నాని చెప్పాడు. తనకు ఆత్మహత్య తప్ప మరో దారి లేదని... తన భార్యను నిత్యానంద నుంచి విడిపించాలని కోరాడు.