దుగరాజపట్నంలో నేషనల్ ప్రాజెక్టు కోసం 3,488 ఎకరాలు
దుగరాజపట్నంలో నేషనల్ మెగా షిప్బిల్డింగ్, షిప్ రిపేర్ క్లస్టర్ ప్రాజెక్టు అభివృద్ధికి సహకరించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలరవాణా మంత్రి సర్బానంద సోనోవాల్ కోరారు.
న్యూఢిల్లీ: దుగరాజపట్నంలో నేషనల్ మెగా షిప్బిల్డింగ్, షిప్ రిపేర్ క్లస్టర్ ప్రాజెక్టు అభివృద్ధికి సహకరించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలరవాణా మంత్రి సర్బానంద సోనోవాల్ కోరారు. ఈరోజు ఢిల్లీలో సీఎం ఆయనతో సమావేశం అయ్యారు.
దుగరాజపట్నంలో నేషనల్ ప్రాజెక్టు కోసం 3,488 ఎకరాల భూమి సమకూర్చేందుకు సీఎం అంగీకారం తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన టెక్నో–ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ (TEFR) సిద్ధమైందని చెప్పారు. *
దుగరాజపట్నం షిప్బిల్డింగ్ క్లస్టర్, ఫిషింగ్ హార్బర్లకు కేంద్ర సాయంపై సోనోవాల్తో సీఎం చంద్రబాబు చర్చించారు. దేశంలో నౌకాశ్రయాలు, నౌకా నిర్మాణ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. “చిప్ టు షిప్” విజన్కు అనుగుణంగా షిప్బిల్డింగ్ రంగాన్ని బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
నౌక నిర్మాణానికి అనుబంధ MSME యూనిట్లు, కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సమగ్ర క్లస్టర్గా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014లో పేర్కొన్న అంశాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. దుగరాజపట్నాన్ని నేషనల్ మెగా షిప్బిల్డింగ్ క్లస్టర్గా త్వరితగతిన ఆమోదించాలని కేంద్రాన్ని కోరారు. ఫిషింగ్ హార్బర్లకు కేంద్రం సాయం చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
ఫేజ్–1లో చేపట్టిన నాలుగు ఫిషింగ్ హార్బర్లకు అదనపు నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కోరారు. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుదల కోసం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టామని సీఎం చెప్పారు.