లెజండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన ప్రేమకథా చిత్రం 'సఖి' (తమిళ అనువాద చిత్రం) ద్వారా తెలుగువారికి కథానాయకుడిగా పరిచయమయ్యాడు మాధవన్. ఆ చిత్రం విజయం సాధించడంతో చాక్లెట్ బోయ్గా మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఆ తరువాత వచ్చిన తమిళ అనువాద చిత్రాలు 'చెలి', 'రన్' కూడా మాధవన్ ఖాతాలో విజయాల్ని చేర్చాయి. 'పరవశం', 'డుమ్ డుమ్ డుమ్', 'అమృత', 'యువ' తదితర తమిళ అనువాద చిత్రాలతో ఇక్కడివారిని సుపరిచితుడైన మాధవన్.. 2010లో వచ్చిన తెలుగు చిత్రం 'ఓం శాంతి'లో ఆర్ జె మ్యాడీగా అతిథి పాత్రతో పలకరించాడు.
ఆ తరువాత మళ్లీ తమిళ్, హిందీ చిత్రాలపైనే ఫోకస్ పెట్టిన మాధవన్.. అతి త్వరలో మరో తెలుగు చిత్రంతో పలకరించేందుకు సిద్ధమయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి.. ఆ చిత్రమే నాగచైతన్య, చందుమొండేటి కాంబినేషన్లో వస్తున్న 'సవ్యసాచి'. 'ప్రేమమ్' వంటి విజయవంతమైన చిత్రం తరువాత చైతు, చందు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాలో మాధవన్ది కథను కీలక మలుపు తిప్పే పాత్రని తెలిసింది. సో.. మాధవన్ని మరోసారి నేరుగా తెలుగు చిత్రంలో చూసే అవకాశముందన్నమాట.