లయకారుడైన శివుని తనలో కొలువుంచుకుని, జీవిత సారాన్ని 'ఆటగదరా శివా... ఆటగద కేశవా.. ' అంటూ మిధునం సినిమాలోని పాట తనికెళ్ళభరణికి ఎంత పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు 'ఆటగదరా శివ' అనే టైటిల్ ఆధారంగా ఓ సినిమా రూపొందుతోంది. 'ఆ నలుగురు', 'మధు మాసం', 'అందరి బంధువయ' వంటి కూల్ అండ్ సెన్సిటివ్ చిత్రాల దర్శకుడు చంద్రసిద్దార్ధ ఈ సినిమాకు దర్శకుడు. నిర్మాత రాక్ లైన్ వెంకటేష్.. రాక్ లైన్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నూతన నటుడు ఉదయ్ శంకర్ టైటిల్ రోల్ లో కనిపించనున్నారు. "ఉరిశిక్ష నుంచి తప్పించుకుని ఓ ఖైదీ బయటపడతాడు. అనుకోకుండా తనను ఉరితీయాల్సిన తలారినే కలుస్తాడు. కానీ ఇద్దరు ఎవరన్నది తెలియకపోవడంతో కలిసి ప్రయాణం చేస్తారు. ఆ ప్రయాణంలో వాళ్లకు ఎదురయ్యే అనుభవాలు ఏంటన్నదే కథ"
సినిమా విడుదల తేదీ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ..నటుడిగా నాకు ఇది మొదటి సినిమా, ఈ సినిమాలోని పాత్రకు తగ్గట్టు నేను దాదాపు 11 నెలల పాటు గడ్డం, జుట్టు పెంచవలసి వచ్చింది. దర్శకుడు చంద్రసిద్దార్ధ ఇచ్చిన తోడ్పాటుకు ఒక నటుడిగా నాకు సంతృప్తినిచ్చింది. చిన్నప్పటి నుంచి పుస్తకాలు బాగా చదివేవాడిని. నా ఊహలకి తగ్గ కథ ఇది. ఈ సినిమా ద్వారా పరిచయమయ్యే అవకాశం లభించినందుకు ఆనందంగా ఉంది. గతంలో నన్ను నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నటుడిని చేస్తానని మాట ఇచ్చారు ఈ సినిమా ద్వారా ఆ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు.. తెలిపారు.
ఇక చిత్ర దర్శకుడు చంద్రసిద్దార్ధ మాట్లాడుతూ..శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఒకరి నొకరు కలిసినా, విడిపోయినా దాని వెనుకున్నది శివుడి లీలే అని నమ్ముతాం. ఆ తాత్వికత ఆధారంగా అల్లుకున్న కథ 'ఆటగదరా శివ'. కన్నడలో విజయవంతమైన `రామ రామ రే` చిత్రం ఆధారంగా తీసుకుని మన నేటివిటీకి తగ్గట్టు తీర్చిదిద్దాను.అలాగే జీవితంలో గ్యారంటీ అంటూ ఉందంటే అది ఒక్క చావుకే. అది తెలిసి కూడా చావంటే చాలా మంది భయపడుతుంటారు. దాన్నుంచి తప్పించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తారు.. ఈ సినిమాలో ఓ ఖైదీ ఆఖరి నిమిషంలో ఉరిశిక్షనుంచి తప్పించుకుని పారిపోతాడు, ఆ తరువాత అతను ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు, దాన్నుచి ఎలా బయటపడతాడనేది ఆసక్తికర సస్పెన్స్ .. అని అన్నారు. కాగా ఈ సినిమాను జులై 14 న విడుదల చేయబోతున్నాం అని వెల్లడించారు.