ఆంద్రప్రదేశ్ లో జన సేన వల్ల కాని, మరే సేన వల్ల కాని తమకు నష్టం లేదని విపక్ష నేత,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ వ్యాఖ్యానించారు. ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన. పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉంటుందని ఆయనను ప్రశ్నించగా, జనసేన, లేదా పవన్ కళ్యాణ్ ప్రభావం కొత్తగా ఏమీ ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో వైసీపీ కంటే టీడీపీకి ఐదు లక్షల ఓట్లు ఎక్కువ వచ్చాయని పేర్కొన్న జగన్.. ఆ ఎన్నికల్లో పవన్, మోదీ కలిసి ప్రచారం చేశారని అన్నారు. వారిద్దరు కలిసి ప్రచారం చేసినా టీడీపీకి అధికంగా వచ్చింది ఐదు లక్షల ఓట్లేనని తెలిపారు. పొత్తుల గురించి అడిగిన ప్రశ్నకు జగన్ స్పందిస్తూ.. వాటి గురించి ఇప్పుడే మాట్లాడడం తొందరపాటే అవుతుందని, ఎన్నికలప్పుడు మాట్లాడుకుంటేనే బాగుంటుందని చెప్పారు జగన్.