ఎంపీ అభ్యర్ధుల కోసం వైసీపీ అన్వేషణ...ఇప్పటికే 7 చోట్ల అభ్యర్ధులు దాదాపు ఖరారు
వచ్చే ఎన్నికల్లో వీలైనంత ఎక్కువ ఎంపీ స్థానాలు దక్కించుకోవాలని భావిస్తున్న వైసీపీ గెలుపు గుర్రాల కోసం అన్వేషణ మొదలుపెట్టింది. ఇప్పటికే అభ్యర్ధుల వేట మొదలుపెట్టిన జగన్మోహన్రెడ్డి ఈసారి ఎక్కువగా కొత్తవారిని రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హీట్ మొదలైంది. అభ్యర్ధుల ఎంపికపై పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. ఇప్పటికే అభ్యర్ధుల వేట మొదలుపెట్టిన వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్స్తోపాటు ఎంపీ అభ్యర్ధుల కోసం కూడా వడపోత చేపట్టింది. అయితే ప్రస్తుతం పార్లమెంట్ స్థానాలకు ఇన్ఛార్జులుగా ఉన్నవారిలో చాలా మందికి టికెట్లు దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఏపీలో ఉన్న మొత్తం 25 ఎంపీ స్థానాలకు గానూ 7 చోట్ల అభ్యర్ధులు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. కడపకు అవినాష్రెడ్డి, రాజంపేటకి మిథున్రెడ్డి, తిరుపతికి వరప్రసాద్, నెల్లూరుకి మేకపాటి రాజమోహన్రెడ్డి, ఒంగోలుకు వైవీ సుబ్బారెడ్డి, విశాఖకు ఎంవీవీ సత్యనారాయణ, ఏలూరుకి కోటగిరి శ్రీధర్లు ఖరారైనట్లు చెబుతున్నారు. ఇక మిగిలిన స్థానాల్లో ఇన్ఛార్జ్ల మార్పు ఖాయమనే టాక్ వినిపిస్తోంది. అయితే ఎక్కువగా కొత్తవారికి అవకాశం ఇవ్వాలని భావిస్తోన్న జగన్ అభ్యర్ధుల కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకోవాలని భావిస్తున్న జగన్మోహన్రెడ్డి బలమైన అభ్యర్ధుల కోసం అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్లకు చూస్తున్నట్లు తెలుస్తోంది.