ఎన్నికల ప్రచారంలో ప్రకటించినట్టుగానే అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ అణు ఒప్పందం నుంచి వైదొలిగారు. ఏడు దేశాలు రెండేళ్లపాటు సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం సాకారమైన ఈ అణు ఒప్పందం నుంచి తప్పుకోవడం తీవ్ర సంచలనంగా మారింది. వైదొలగిన మరుక్షణమే ఇరాన్పై పలు ఆంక్షలు విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. దీంతో ఇరాన్ ఆటోమొబైల్ రంగంపై మూడు నెలల తర్వాత, చమురు రంగంపై ఆరు నెలల తర్వాత ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. దీని ప్రకారం అమెరికా మిత్ర దేశాలు ఇరాన్ నుంచి ముడి చమురు కొనుగోళ్లు తగ్గించుకోవాల్సి ఉంటుంది. లేని మిత్రదేశాల బ్యాంకులపై ఆరు నెలల తర్వాత అమెరికా ఆంక్షలు విధించే ప్రమాదముంది. ట్రంప్ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, చైనా, జర్మనీ తాము ఒప్పందానికి కట్టుబడి ఉంటామంటూ ప్రకటించడంతో .. తాజా పరిణామాలు ఎటు దారితీస్తాయోననే ఉత్కంఠ నెలకొంది.