వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు కొత్త మలుపు తిరిగింది. విశాఖ ఎయిర్పోర్ట్లో తనపై జరిగిన దాడిపై దర్యాప్తును స్వతంత్ర సంస్థకు అప్పగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. డీజీపీ ఆర్పీ ఠాకూర్తోపాటు మొత్తం 8మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు విచారణను రెండు వారాలపాటు వాయిదా వేసింది.
ఇదే ఘటనపై వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డితోపాటు మరొకరు దాఖలు చేసిన పిటిషన్లను కూడా విచారించిన హైకోర్టు సిట్ దర్యాప్తు పురోగతిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అలాగే సిట్కు నేతృత్వం వహిస్తున్న అధికారి, ఆ బృందంలో ఉన్న ఇతర పోలీస్ అధికారుల వివరాలను కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పటివరకూ జరిగిన దర్యాప్తుపై సిట్ ఇప్పటికే హైకోర్టుకు నివేదిక సమర్పించగా, మరోసారి సీల్డ్ కవర్లో రిపోర్ట్ సమర్పించాలని సిట్ అధికారులను ఆదేశించింది.
కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక ప్రశ్నలను లేవనెత్తింది. విశాఖ ఎయిర్పోర్ట్లో సీసీటీవీ ఫుటేజ్ వివరాలు ఏమయ్యాయని అధికారులను ధర్మాసనం ప్రశ్నించింది. గత మూడు నెలలుగా సీసీటీవీ ఫుటేజ్ లేదని అధికారులు తెలపడంతో హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తంచేసింది. సీసీటీవీ పర్యవేక్షణ ఎవరి ఆధీనంలో ఉందని ధర్మాసనం ప్రశ్నించగా సిట్ అధికారులు సమాధానం చెప్పలేకపోయినట్లు తెలుస్తోంది. దాంతో విశాఖ ఎయిర్పోర్ట్లో భద్రతా లోపాలు క్షమించరానిదన్న హైకోర్టు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. విమానాశ్రయంలో భద్రతా లోపాలపై వివరణ ఇవ్వాలని సీఐఎస్ఎఫ్ అధికారులను ఆదేశించింది.