పెళ్ళైన మూడు నెలలకే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో చోటుచేసుకుంది. అమలాపురం మండలం విద్యుత్నగర్కు చెందిన రావూరి ఏడుకొండలు, పద్మ దంపతులు. వారికి అరుణాదేవి(24) కుమర్తె ఉంది. బీటెక్ చదివిన అరుణనను అదే ప్రాంతానికి చెందిన పెరుమాళ్ళుకు ఇచ్చి మూడునెలల కిందట వివాహం చేశారు. పెరుమాళ్ళు ఉద్యోగరీత్యా ఫ్రాన్స్ లో స్థిరపడ్డారు. అతని తలిదండ్రులు కూడా అక్కడే ఉన్నారు. పెరుమాళ్ళు పెళ్లి అనంతరం నెల రోజులపాటు ఇండియాలో ఉండి ఆ తర్వాత భార్య అరుణాదేవిని వెంట తీసుకుని వెళ్లకుండా ఆమెను పుట్టింటి వద్దే ఉంచి ఫ్రాన్స్ వెళ్లిపోయాడు.
అక్కడికి వెళ్లిన తర్వాత నుంచి పెరుమాళ్లు భార్య అరుణాదేవికి రోజూ ఫోన్ చేసి అదనపు కట్నం కోసం వేధించేవాడని పోలీసులు తెలిపారు. భర్తతో పాటు అతడి తల్లిదండ్రులు, హైదరాబాద్లో ఉంటున్న అతడి సోదరి కూడా ఫోన్ చేసి తనకు అదనంగా మరో రూ.10 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో పెరుమాళ్లు నుంచి భార్య అరుణాదేవికి బుధవారం ఫోన్ వచ్చింది. మళ్లీ అదనపు కట్నం కోసం అరుణాదేవిని ఫోన్లో పదేపదే వేధించడంతో తట్టుకోలేక మనస్థాపం చెంది అమలాపురంలోని తన పుట్టింటిలోనే ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకుంది. కుమర్తె మరణించిందన్న వార్తను జీర్ణించుకోలేని తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.వారి ఫిర్యాదు మేరకు పెరుమాళ్ళు, అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.