శాసనసభలో రచ్చతో సభ్యత్వాన్ని కోల్పోయిన టీ కాంగ్రెస్ నేతలు రాజ్యసభ సభ్యుల ఎన్నికల్లో ఓటేసే హక్కుకూ దూరమవుతున్నారు. తెలంగాణ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యుల ఎన్నిక కోసం ఈ నెల 23న జరగనున్న ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్కుమార్లకు ఓటు హక్కు దాదాపు లేనట్టే. ఈ నెల 12న శాసనసభలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో స్పీకర్ వీరి శాసనసభ సభ్యత్వాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు స్థానాలు ఖాళీ అయినట్లుగా కేంద్ర ఎన్నికల కమిషన్కు కూడా సమాచారం అందించారు.
సభ్యత్వాలను రద్దుచేయడంపై వారిద్దరూ హైకోర్టును ఆశ్రయించగా ఆ రెండు ఖాళీలపై 6 వారాల పాటు ఎలాంటి ఎన్నికల ప్రక్రియ చేపట్టవద్దని న్యాయస్థానం ఆదేశించింది. అయితే సభ్యత్వాల రద్దుపై స్టే కానీ, రద్దును వ్యతిరేకిస్తూ ఆదేశాలు గానీ ఇవ్వలేదు. అంటే ఇద్దరు సభ్యులూ ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నట్లే. ఈ నెల 23 నాటికి శాసనసభ్యులుగా ఉన్నవారే ఓటు వేసేందుకు అర్హులని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. మరోవైపు రాజ్యసభ అభ్యర్థుల ఓటర్ల జాబితాలో బహిష్కృత ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్ కుమార్లను కొనసాగించాలని టీపీసీసీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు బుధవారం కోమటిరెడ్డి, సంపత్లతో కలిసి మర్రి శశిధర్రెడ్డి ఈసీకి విజ్ఞప్తి చేశారు.