రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం CLP విప్ శాసనసభ సభ్యత్వం రద్దు చేయడంతో కాంగ్రెస్ విప్ను మార్చుతూ నిర్ణయం తీసుకుంది. రాజ్యసభ ఓటింగ్ సమయంలో బరిలోకి దిగిన వ్యూహాన్ని విజయవంతం చేయడానికి పావులు కదువుతోంది హస్తం పార్టీ. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన కాంగ్రెస్ రాజ్యసభ ఎన్నికల్లో రంగంలో దిగి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి వ్యూహం రచిస్తోంది. గెలిచేంత సంఖ్యా బలం లేకున్నా మాజి కేంద్ర మంత్రి బలరాం నాయక్ను బరిలోకి దింపింది.
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున 21 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వీరిలో పాలేరు, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు చనిపోవడంతో జరిగిన ఉపఎన్నికల్లో trs గెలిచింది. మిగిలిన 19 మందిలో ఏడుగురు కారెక్కారు. దీంతో కాంగ్రెస్ బలం 12కు చేరింది. వీరిలో ఇద్దరిని బహిష్కరించడంతో కాంగ్రెస్కు మిగిలింది 10 మంది ఎమ్మెల్యేలు. రాజ్యసభ ఎన్నికల్లో గెలుపొందాలంటే 30 మంది ఎమ్మెల్యేలు ఓటేయాలి.
CLP విప్ సంపత్ను టార్గెట్ చేసిన అధికార పార్టీ.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయకుండా శాసనసభ నుంచి బహిష్కరించి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దీంతో సంపత్ స్థానంలో విప్గా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని నియమించారు సీఎల్పీ నేత జానారెడ్డి. చేతి గుర్తుపై గెల్చిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్కే ఓటేసేలా విప్ జారీ చేయనున్నారు. వేటు పడిన ఎమ్మెల్యేలకు ఓటు హక్కు కల్పించాలని ఎన్నికల సంఘాన్ని కోరేందుకు కాంగ్రెస్ నేతల బృందం నేడు ఢిల్లీ వెళ్తోంది. ఈ ఎన్నికల్లో పార్టీ అనుకున్నది సాధిస్తుందా? దీనికి టీడీపీ కూడా సహకరిస్తుందా అనేది వేచి చూడాల్సిందే.