ఏపీలో కాంగ్రెస్కు షాక్.. టీడీపీలో చేరేందుకు సిద్ధమైన ఇద్దరు కీలక నేతలు !
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వలసలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఒక పార్టీ నుంచి మరోక పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. రాజకీయ నేతలు వరుసపెట్టి ఒక పార్టీ నుంచి మరోక పార్టీలోకి జంప్ అవుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు సైకిల్ ఎక్కేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి బుధవారం భేటీ అయ్యారు. టీడీపీలో చేరే అంశంపై ఈ సందర్భంగా ఇరువురి మధ్య మంతనాలు జరిగినట్లు తెలుస్తోంది. కనిగిరిలో కీలక నేతగా పేరొందిన ఆయన టీడీపీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందిన కాంగ్రెస్ మాజీ మంత్రి కొండ్రు మురళి కూడా టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయన మంత్రి కళా వెంకట్రావుతో భేటీ అయ్యారు. దీంతో రాజాం నియోజకవర్గంలో రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. వీరిద్దరు మాత్రమే కాకుండా.. పలువురు కాంగ్రెస్ మాజీలు టీడీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. ఎన్నికల నాటికి కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి భారీ వలసలుండటం ఖాయంగా కనిపిస్తోంది.