తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఫోన్ కాల్స్ భయం పట్టుకుంది. రాత్రి పది దాటితే PCC ముఖ్యనేత నుంచి ఎక్కడ ఫోన్ వస్తుందోనని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడేం మాట్లాడినా..రాత్రి ఆ నేత క్లాస్ పీకుతున్నారని గాంధీ భవన్లో హాట్ హాట్గా చర్చ జరుగుతోంది.
మొన్నటి వరకు TRS పార్టీలో ఉన్న సంస్కృతి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి పాకింది. ఉద్యమ సమయంలో పార్టీ నేతలెవరూ తప్పుగా మాట్లాడినా రాత్రి వాళ్లకు గులాబీ బాస్ ఫోన్ చేసి క్లాస్ తీసుకునేవారనే ప్రచారం ఉంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో ఇదే ట్రెండ్ మొదలైందని గాంధీభవన్లో చర్చ సాగుతోంది. రాత్రి అవగానే PCC ముఖ్యనేత నుంచి ఫోన్ వస్తోందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
బీసీలకు జనాభా ప్రాతిపదికన రానున్న ఎన్నికల్లో కనీసం 44 టికెట్లు ఇవ్వాలని బీసి సెల్ చైర్మన్ చిత్తరంజన్ దాస్ ఇటీవల మహబూబ్ నగర్లో జరిగిన బీసీ సమావేశంలో ప్రతిపాదించారు. ఇది జరిగిన 15 రోజులకు PCC ముఖ్యనేత ఆయనకు రాత్రి ఫోన్ చేసి క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ముందు జాగ్రత్తగా మాట్లాడకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారట. అయితే మహబూబ్ నగర్లోని 14 నియోజకవర్గాల్లో 2 రిజర్వ్డ్ స్థానాలు మినహాయిస్తే 12 సీట్లలో రెండు టికెట్లు బీసీలకు ఇవ్వమనడం తప్పా అని చిత్తరంజన్ ప్రశ్నించినట్లు తెలిసింది. ఎలాంటి చర్యలు తీసుకున్నా వెనక్కి తగ్గేది లేదని తెగేసి చెప్పడంతో ఆ నేత కంగు తిన్నట్లు తెలుస్తోంది.
ఇక ఇటీవల ఇద్దరు శాసనసభ్యుల సభ్యత్వం రద్దు వ్యవహారంలో మాజీ మంత్రి కోమటిరెడ్డిని ఆ ముఖ్యనేత మందలించినట్లు టాక్. తమను PCC, సీఎల్పీ పట్టించుకోవడంలేదని ఇద్దరు సభ్యులు చెప్పడంపై కోమటిరెడ్డికి ఆ లీడర్ ఫోన్ చేసి అలా ప్రచారం చేయడం సరికాదని.. వెంట ఉండి దీక్షలు చేసింది మర్చిపోయారా? అని ప్రశ్నించారు. దీక్ష తరువాత అనుకున్న కార్యక్రమాలు ఎందుకు చేయలేదని కోమటిరెడ్డి ఎదురు ప్రశ్నించడంతో ఆ నేత ఫోన్ కట్ చేశారని సమాచారం. ముఖ్యనేత కొత్త ఆనవాయితీకి తెరలేపడంతో పార్టీకి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా తమకూ ఫోన్లో క్లాస్ ఉంటుందని గాంధీభవన్ నేతలు అనుకుంటున్నారు.