వరుస కేసులతో కాంగ్రెస్ నాయకుల్లో వణుకుపుడుతోంది. గండ్ర వెంకటరమణారెడ్డి, జగ్గారెడ్డి, రేవంత్రెడ్డి. తర్వాత క్యూ లో ఉన్నదెవరు..? రాజకీయ కక్షలు అనే ఆరోపణలు కావచ్చు లేక చట్టం తన పని తాను చేసుకుపోతోందేమో కావచ్చు ఏదేమైనా వరుసగా కాంగ్రెస్ నాయకులు రకరకాల కేసుల్లో చిక్కుకుంటున్నారు. మరి తర్వాత ఎవరు..? ప్రతిపక్ష పార్టీలో తదుపరి గురి ఎవరిపై..? అధికారులు ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు..?
ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలను కేసులు వెంటాడుతున్నాయి. పాత కేసులకు తోడు ఐటీ దాడులు హడలెత్తిస్తున్నాయి. మొన్న గండ్ర సోదరులు, నిన్న జగ్గారెడ్డి, తాజాగా రేవంత్ రెడ్డిపై ఐటీదాడులుతో తర్వాతి వంతు ఎవరనేదానిపై చర్చ జరుగుతోంది. గతంలో కేసులు ఎదుర్కొన్న వారిలో మరింత ఆందోళన నెలకొంది.
కాంగ్రెస్ ముఖ్య నాయకుల ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలుకు సంబంధించిన ఓ లిస్టును సీఎం కేసీఆర్ ప్రధాని మోడీకి అందజేసినట్లు ఆరోపిస్తున్న కాంగ్రెస్ నేతలు పోలీసు, సీబీఐ, ఐటీ, ఈడీ తదితర సంస్థలతో విచారణ జరపించాలని కోరినట్లు చెబుతున్నారు. ఇవన్నీ కేసీఆర్ ప్రేరేపిత దాడులంటూ ఆలంపూర్ తాజా మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ ఆరోపించారు. టీఆర్ఎస్ భవన్ కేంద్రంగా కుట్రలు జరుగుతున్నాయని తనతో పాటు రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట రెడ్డిలను అసెంబ్లీకి పంపకుండా ఉండేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికల్లో తమ విజయాన్ని ప్రభావితం చేసే నాయకులే టార్గెట్గా కేసీఆర్ ఇలాంటి పన్నాగాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరికొందరు కాంగ్రెస్ నాయకులైతే ముందస్తుగానే వారికి సంబంధించిన లీగల్ ఎక్స్పర్ట్స్ను సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. తమపై దాడులు చేస్తే ఎలా వ్యవహరించాలనే దానిపై న్యాయసలహాలు తీసుకుంటున్నట్టు సమాచారం.