తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ చేతులు కలిపే దిశగా అడుగులు పడుతున్నాయి. కేసీఆర్ను ఓడించడమే లక్ష్యంగా మహా కూటమి ఏర్పాటులో భాగంగా కాంగ్రెస్, టీడీపీ పార్టీల భేటీ జరిగింది. రెండు పార్టీల నాయకులు పార్క్ హయత్ హోటల్లో సమావేశం అయ్యారు. కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, సుధీర్రెడ్డి హాజరు కాగా… టిటీడీపీ నుంచి ఎల్.రమణ, పెద్దిరెడ్డి, నామా నాగేశ్వర్రావు పాల్గొన్నారు. ఇక సీపీఐ నాయకులు కూడా ఈ భేటీకి వచ్చారు. ఆ పార్టీ నుంచి చాడ వెంకట్రెడ్డి, పల్లా వెంకట్రెడ్డి భేటీలో పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్, టీడీపీల మధ్య ఇప్పటికే ఓ దఫా చర్చలు పూర్తవగా తాజాగా.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అన్న విషయంపై ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, టీడీపీ కి చెందిన బలమైన నియోజకవర్గాల్లో రెండు పార్టీలకు బలమైన నాయకులు ఉన్నందున అక్కడ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలి అన్న దానిపై చర్చ ఉన్నట్టు తెలుస్తోంది.