అనారోగ్యంతో బుధవారం అర్థరాత్రి కన్నుమూసిన మాజీ మంత్రి తెదేపా ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడుకి తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు నివాళులర్పించారు. ముద్దుకృష్ణమ మృతి సమాచారం తెలుసుకున్న నేతలు బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రికి చేరుకుని కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, తెదేపా ఎమ్మల్సీ బుద్ధా వెంకన్న, తెలంగాణ తెదేపా నేతలు ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, తెలంగాణ కాంగ్రెస్ సభాపక్ష నేత జానారెడ్డి, ఎన్టీఆర్ కుమారులు హరికృష్ణ, రామకృష్ణ, సినీనటుడు చలపతిరావు, లక్ష్మీపార్వతి తదితరులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ముద్దుకృష్ణమనాయుడు మృతిపట్ల సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంతాపం ప్రకటించారు.
సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్ర్భాంతి
తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు హఠాన్మరణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెదేపా ప్రస్థానంలో ముద్దుకృష్ణమ పాత్ర కీలకమైనదని.. ఆయన మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని చంద్రబాబు అన్నారు. పార్టీకి, ప్రజలకు ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
గాలి ముద్దుకృష్ణమ మృతి పట్ల కేంద్రమంత్రి సుజనాచౌదరి, రాష్ట్ర మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, కళా వెంకట్రావు, నారా లోకేశ్, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, దేవినే ఉమామహేశ్వరరావు, గంటా శ్రీనివాసరావు, సినీనటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ తదితరులు సంతాపం ప్రకటించారు.