తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు తనలోని దానకర్ణుడిని తెరమీదకు తీసుకువచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్లో శుక్రవారం క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. చిన్నారులకు బట్టలు పంపిణీ చేశారు. తర్వాత క్రిస్మస్ కేక్ను చిన్నారులతో కట్ చేయించారు. క్రైస్తవ బంధువులందరికీ వందనాలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జెరూసలేం వెళ్లే క్రిస్టియన్లకు రాయితీ కల్పిస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది వరకు క్రిస్టియన్ భవన్ పూర్తవుతుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
పరాధీన స్థితిలో ఉన్న తెలంగాణ స్వాధీన స్థితిలోకి వచ్చి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. గత పాలకుల హయాంలో ఇలాంటి క్రిస్మస్ వేడుకలు ఎప్పుడూ జరగలేదని పేర్కొంటూ దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా క్రిస్మస్ వేడుకలు అధికారికంగా నిర్వహించడం లేదని తెలిపారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే క్రిస్మస్ వేడుకలు అధికారికంగా నిర్వహిస్తున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. పాత చర్చిల మరమ్మతులు, కొత్త చర్చిల నిర్మాణానికి ప్రభుత్వం సహకరిస్తుందన హామీ ఇచ్చారు. ఇందుకు కావాల్సిన నిధులు వెంటనే విడుదల చేస్తామని ప్రకటించారు. లక్షలాది మంది పేద క్రిస్టియన్లకు బహుమతులు ఇస్తున్నామని చెప్పారు.
పాత చర్చిల మరమ్మతులు, చర్చిల నిర్మాణానికి పది కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ ఏడాది మైనార్టీ గురుకులాల్లో 4వేల 282 క్రిస్టియన్లకు అడ్మిషన్లు కల్పించామన్నారు. వీఆర్ ఆల్ వన్…తెలంగాణ కేస్ ఫర్ ఎవ్రీ వన్ అంటూ సీఎం కేసీఆర్ చెప్పడంతో క్రైస్తవ సోదరులు సంతోషం వ్యక్తం చేశారు. అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకోవడం గతంలో ఎప్పుడూ లేదు. ప్రజలకు మేలు చేసే ప్రతీ పనిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ఈ సందర్భంగా కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు.