'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రంతో వంద చిత్రాల మైలురాయికి చేరుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఆ తరువాత 'పైసావసూల్'తో మరోసారి అభిమానుల ముందుకొచ్చారాయన. ఇటీవలే విడుదలైన ఈ సినిమా కమర్షియల్గా వర్కవుట్ కాలేదు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బాలయ్య తన 102వ చిత్రంతో బిజీగా ఉన్నారు. సీనియర్ తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నెల రోజులుగా కుంభకోణంలో షూటింగ్ జరుపుకుంటోంది. నేటితో ఆ భారీ షెడ్యూల్ పూర్తయ్యింది.
ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలతో పాటు ఓ భారీ పోరాట ఘట్టాన్ని చిత్రీకరించారు. అలాగే బాలకృష్ణపై ఓ పాటని చిత్రీకరించారు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నయనతార, నటాషా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి సి.కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.