చంద్రబాబు, కేసీఆర్ మధ్య మళ్లీ దూరం పెరుగుతుందా?... గతంలో ఇద్దరి మధ్యా జరిగిన మాటల యుద్ధం మరోసారి రిపీట్ కాబోతుందా? ఓటుకు నోటు ఎపిసోడ్తో ఇద్దరి మధ్యా మొదలైన విభేదాలు మరోసారి తెరపైకి రానున్నాయా? ప్రస్తుతం ఇద్దరి మాటలూ చూస్తుంటే అలానే కనిపిస్తోంది. గతంలో ఒకరినొకరు ఘాటుగా తిట్టుకున్న చంద్రబాబు, కేసీఆర్లు మరోసారి.... అలాంటి సంకేతాలనేపంపారు.
అభివృద్ధిలో తెలంగాణకు ఏపీతో పోలికే లేదన్న కేసీఆర్ వ్యాఖ్యలతో ఇద్దరి మధ్యా మాటల యుద్ధానికి తెరలేచింది. కేసీఆర్ వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయన్న చంద్రబాబు 1995 తర్వాత హైదరాబాద్ అభివృద్ధి తన ఘనతేనని గుర్తుచేశారు. 1995కి ముందు ఆ తర్వాత చూస్తే వాస్తవాలు తెలుస్తాయని కేసీఆర్కి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణను ఆంధ్రా పాలకులు ధ్వంసం చేశారన్న కేసీఆర్ వ్యాఖ్యలపైనా చంద్రబాబు అభ్యంతరం వ్యక్తంచేశారు.
ఇంతకు ముందూ ఇద్దరి మధ్యా మాటల యుద్ధం జరిగింది ఓటుకు నోటు ఎపిసోడ్తో దూరం మరింత పెరిగింది ఇద్దరి మధ్యా విభేదాలు తారాస్థాయికి చేరాయి. మాటల తూటాలతో ఇద్దరూ ఢీ అంటే ఢీ అనుకున్నారు. అయితే కొద్దిరోజులకే మళ్లీ కలిసిపోయారు. ఒకరినొకరు పొగుడుకుని షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్నారు. శాలువాలు కప్పుకుని సన్మానాలు చేసుకున్నారు. గవర్నర్ విందుల్లోనూ కలిసిమెలిసి కనిపించారు. అయితే ఇప్పుడు చేసిన వ్యాఖ్యలతో మరోసారి మాటల యుద్ధానికి తెరలేచే అవకాశం కనిపిస్తోంది.