ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందస్తు సంకేతాలు ఇచ్చారు. సాధారణ ఎన్నికలు మరికొన్ని నెలల్లోనే జరిగే అవకాశాలు ఉన్నాయని.. సిగ్నల్స్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో దీనికి సంబంధించి నాయకులకు క్లాస్ తీసుకున్నారు. అంతేకాకుండా.. వారి నుంచి తీసుకున్న ఫీడ్ బ్యాక్పై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు.. తన దగ్గర అందరి లెక్కలున్నాయని.. స్పష్టం చేశారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. ఎదుర్కోనేందుకు సిద్దంగా ఉండాలని.. క్యాడర్కు.. టీడీపీ ఛీఫ్, ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. ఉండవల్లిలో సుమారు 3 గంటల పాటు జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో.. ఎన్నడూ లేని విధంగా హాట్ హాట్ గా సాగింది. సమావేశానికి హాజరుకాని నేతలపై బాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నాయకులు గ్రామాలకు వెళ్ళడం మరిచిపోయారని.. గ్రామదర్శిని పేరుతో వారానికి ఒకరోజు పల్లెలకు వెళ్ళి సంక్షేమ పథకాలను వివరించాలని ఆదేశించారు.
ఇటు విభజన హామీల అమలు కోసం.. రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు చేయాలని నిర్ణయించారు. కడపలో స్టీల్ ప్లాంట్, విశాఖలో రైల్వే జోన్, గోదావరి జిల్లాలలో పెట్రో కాంప్లెక్స్, దుగరాజపట్నం పోర్టు తదితర అంశాలపై చంద్రబాబు యాక్షన్ ప్లాన్ ఇచ్చారు. అంతేకాకుండా.. రాబోయే 6 నెలల్లో సుమారు 75 కార్యక్రమాల్లో తాను పాల్గొంటానన్న చంద్రబాబు.. 13 జిల్లాల యూనివర్సిటిల విద్యార్ధులతో.. భేటి అవుతానని తెలిపారు.
ఇక మూడో ధర్మ పోరాట సభ రాజమండ్రిలో గోదావరి తీరాన.. పెడితే బాగుంటుందనే అభిప్రాయాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు. ఎన్నికల్లోపు అన్ని జిల్లాల్లోనూ.. ధర్మ పోరాట సభలు పూర్తి చేసుకుని.. చివరిసభ విజయవాడ-గుంటూరులో నిర్వహించాలని నిర్ణయించారు. ఇక పనితీరు సరిగ్గా లేని నాయకులకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. ప్రజల్లోకి వెళ్లని నాయకులకు భవిష్యత్ ఉండదని.. హెచ్చరించారు.