కాంగ్రెస్ కంచుకోట.... టీఆర్ఎస్ టార్గెట్.... క్లీన్ స్వీప్ చేసి ప్రతిపక్షాన్ని మూడు చెరువుల నీళ్లు తాగించాలనే సంకల్పంతో నల్లగొండ జిల్లాకు రాబోతున్నారు కేసీఆర్. నిజామాబాద్ సభలో ప్రతిపక్షాలను చీల్చిచెండాడిన కేసీఆర్ నల్లగొండలో కూడా అదే ఫామ్ను కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. వరుసగా ప్రజా ఆశీర్వాద సభలను ఏర్పాటు చేస్తున్న టీఆర్ఎస్ అధినేత ఇవాళ నల్లగొండలో నగారా మోగించనున్నారు.
ప్రతిపక్షానికి ఆయువుపట్టుగా ఉన్న నల్లగొండను ఎలాగైనా చేజిక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ ప్రజాశీర్వాద సభలో పాల్గొననున్నారు. సభను విజయవంతం చేయడమే లక్ష్యంగా టీఆర్ఎస్ శ్రేణులు ప్రణాళికలు రచిస్తున్నాయి. కనీసం 3 లక్షల మందికి తగ్గకుండా జనసమీకరణ చేయాలని చూస్తున్న గులాబీ పెద్దలు అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ నియోజకవర్గం నుంచి పాతిక వేలకు తగ్గకుండా జనాలను తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ మెజారిటీ సీట్లు గెలుచుకుంది. హుజుర్ నగర్, కోదాడ, నాగార్జున సాగర్, నల్గోండ, మిర్యాలగూడలో కాంగ్రెస్ అభ్యర్దులు గెలిచినా మిర్యాలగూడ ఎమ్మెల్యే, దేవరకొండ ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే కాంగ్రెస్ నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన నాయకులు ఆ పార్టీ అగ్రనాయకుల ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. రెండో విడత సాగుతున్న ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా కాంగ్రెస్ బడా నాయకుల అనుచరులకు గులాబీ తీర్థం ఇచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
ఇక కేసీఆర్ రాకతో జిల్లాలో పార్టీకి మంచి ఊపు వస్తుందని లోకల్ లీడర్లు భావిస్తున్నారు. గులాబీ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా కేసీఆర్ సభలో ఏం చెప్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహాకూటమిపై విమర్శలతో పాటు జిల్లా సమస్యలపై హామీలిచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.