హైదరాబాద్ః నగరంలోని అమీన్పూర్లో దారుణం జరిగింది. ఇంటి నుంచి కనిపించకుండా పోయిన 17ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చాందిన్ జైన్ అనే బాలిక సెప్టెంబర్ 9న మియాపూర్లోని ఇంటి సమీపంలో అదృశ్యమైంది. సెప్టెంబర్ 11 సాయంత్రం అమీన్పూర్లో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్మెంట్ సమీపంలో రాళ్ల మధ్య శవంగా కనిపించింది. తమ కూతురు క్షేమంగా ఇంటికి తిరిగొస్తుందని భావించిన తల్లిదండ్రులు గుర్తుపట్టలేని స్థితిలో ఆమె కనిపించడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. ఆమె మృతదేహం కనిపించిన తీరును పరిశీలించిన పోలీసులు.. హత్యకు గురైనట్లు అనుమానిస్తున్నారు. సెప్టెంబర్ 11న సాయంత్రం 5గంటలకు ఇంటి నుంచి చాందిని తన స్నేహితులను కలవడానికి వెళ్లిందని, 06.30 నిమిషాలకు ఆమెకు ఫోన్ చేయగా పనిచేయలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె ఫ్రెండ్స్కు ఫోన్ చేసినా ఆచూకీ తెలియలేదన్నారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో తమ కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేసినట్లు తల్లిదండ్రులు తెలిపారు. తమకు ఎవరితో విభేదాలు లేవని, ఆమెపై కక్ష పెంచుకుని చంపేంత అవసరం ఎవరికుందో అర్థం కావడం లేదని చాందిని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మియాపూర్ పోలీసులు ఈ కేసుపై స్పందిస్తూ.. మైనర్ కిడ్నాప్కు గురైనట్లు ఫిర్యాదు చేసిన రోజే కేసు నమోదు చేశామని చెప్పారు. చాందిని మృతదేహంపై ఎలాంటి గాయాలు కనిపించడం లేదని, అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆమెను అత్యాచారం చేసి హతమార్చారా లేక హత్య చేశారా అనే విషయంపై పోస్టుమార్టం తర్వాత స్పష్టత వచ్చే అవకాశముంది. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ టీవీ దృశ్యాలు రికార్డవలేదని, ఏం జరిగిందనే దానిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని మియాపూర్ పోలీస్ స్టేషన్కు చెందిన అధికారి తెలిపారు. సంగారెడ్డి ఎస్పీ ఎస్ చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ ఘటనా స్థలిని పరిశీలించామని, మృతదేహం కనిపించదనే సమాచారం తెలియగానే ఎస్ఐ చేరుకున్నారని చెప్పారు. అప్పటికే మృతదేహం కుళ్లి దుర్వాసన వచ్చినట్లు తెలిసిందని ఎస్పీ తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆమె ఫోన్లో చివరి కాల్ 3.30 నిమిషాలకు చేసినట్లు తేలిందని, 5గంటల సమయంలో ఆమె కనిపించకుండా పోయిందని పోలీసులు తెలిపారు. అయితే బ్లూ వేల్ చాలెంజ్ వల్ల చాందిని మృతిచెంది ఉంటుందనే అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం ఈ కోణాన్ని కొట్టిపారేస్తున్నారు. చాందినిని హత్య చేసి ఉంటారనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.