టాలీవుడ్లో బడా హీరోల మల్టీస్టారర్స్ వచ్చి చాలాకాలమే అయింది. శమంతకమణిలో నలుగురు హీరోలు కలిసి నటించినప్పటికీ చిన్న సినిమా కావడంతో సినిమా హిట్టయింది కానీ ఆ కాంబినేషన్కు ఆశించినంత పేరు రాలేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత ఆ స్థాయి మల్టీస్టారర్ తెలుగులో ప్రస్తుతానికి రాలేదనే చెప్పాలి. అయితే ఈ లోటును భర్తీ చేస్తూ ఓ క్రేజీ కాంబినేషన్లో మల్టీస్టారర్ తెరకెక్కబోతోంది. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈతరం హీరో నాని, యాభై ఎనిమిదేళ్ల వయసులో కూడా కుర్రహీరోలతో పోటీ పడి హిట్లు కొడుతున్న నాగార్జున కలిసి నటించబోతున్నారు. ఈ మల్టీస్టారర్కు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించనున్నాడు.
శమంతకమణి సినిమాతో ఈ డైరెక్టర్ రీసెంట్గా హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. నిర్మాత అశ్వినీదత్ ఈ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించనున్నారు. భారీ బడ్జెట్తో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. రాజుగారి గది-2 షూటింగ్లో నాగార్జున, ఎంసీఏ సినిమా షూటింగ్లో నేచురల్ స్టార్ నాని బిజీగా ఉన్నారు. వీటి షూటింగ్ పూర్తయిన తర్వాత ఇద్దరు హీరోలు ఈ సినిమాలో నటించనున్నారు. ఇప్పటికే దర్శకుడు ఇద్దరినీ ఒప్పించినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు నిర్మాత అశ్వినీదత్ ఇప్పటికే ప్రకటించారు.