బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు పండుగ షాకిచ్చింది. బ్యాంక్ తాజాగా సేవింగ్స్ అకౌంట్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ)పై వడ్డీ రేట్లను తగ్గించింది. ఇప్పుడు రూ.లక్షలోపు బ్యాలెన్స్ ఉన్న బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేటు 3.5 శాతంగా ఉంటూ వస్తోంది. ఇకపై ఈ వడ్డీ రేటు 3.25 శాతానికి దిగొచ్చింది. అదేసమయంలో రూ.లక్షకు పైన బ్యాలెన్స్ ఉన్న సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేటు 3 శాతానికి తగ్గుతుంది. 2019 నవంబర్ 1 నుంచి ఈ కొత్త రేట్లు అమలులోకి వస్తాయి. స్టేట్ బ్యాంక్ రూ.లక్షకు పైన బ్యాలెన్స్ ఉన్న అకౌంట్లను రెపో రేటుతో లింక్ చేసింది.
వ్యవస్థలో లిక్విడిటీ సరిపడినంత స్థాయిలో ఉందని అందుకే సేవింగ్స్ అకౌంట్స్, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గిస్తున్నామనిచెబుతూ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఎఫ్డీ, టర్మ్ డిపాజిట్లపై 10 నుంచి 30 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గించింది. ఒక నెలలో వరుసగా రెండో సారి ఎఫ్డీలపై వడ్డీ రేట్లు తగ్గించడం ఇదే మొదటి సారి. కొత్త వడ్డీ రేట్లు అక్టోబర్ 10 నుంచి అమలులోకి వస్తాయి. ఇప్పుడు ఎఫ్డీ రేట్లు 4.5 శాతం నుంచి 6.25 శాతం మధ్యలో ఉన్నాయి.
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించడం ఇది వరుసగా ఐదో సారి.