India crude oil stocks: యుద్ధంతో ఆగిన ఆయిల్.. భారత్ దగ్గర ఉన్న నిల్వ ఎంత కాలం సరిపోతుందో తెలుసా?
India crude oil stocks: మధ్య ప్రాచ్యంలో యుద్ధ కారణంగా ఆయిల్ సరఫరాలు నిలిచిపోయాయి. ఇప్పుడు భారత్ వద్ద ఉన్న ఆయిల్ నిల్వలు ఎన్ని రోజుల వరకూ ఉపయోగపడతాయి
India crude oil stocks
India crude oil stocks: ఆ దేశాల మధ్య వైరం.. ప్రపంచానికి ఇరకాటంగా మారింది. ఇరాన్ - ఇజ్రాయేల్ - అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాలన్నిటిమీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇరాన్ ఆధీనంలో ఉన్న ఇరుకైన హార్ముజ్ జలసంధిని దిగ్బంధం చేసింది. దీంతో చాలాదేశాలకు ఆయిల్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఈ మార్గం నుంచి వెళ్లే అన్ని ఆయిల్ షిప్స్ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఈ యుద్ధం ఎన్ని రోజులు ఉంటుందో.. తిరిగి ఎప్పుడు సాధారణ పరిస్థితులు వస్తాయో అంచనా వేయడం కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఆయిల్ రవాణా ఆగిపోవడం భారత్ పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే, మనదేశం చమురు అవసరాల్లో ఎక్కువ భాగం హార్ముజ్ జలసంధి ద్వారానే దిగుమతి అవుతుంది. ఇప్పుడు అది మూసుకుపోవడంతో మనకు వచ్చే ఆయిల్ సరఫరా తీవ్రంగా దెబ్బతింది.
India crude oil stocks: ఈ నేపథ్యంలో భారత్ దగ్గర ఉన్న క్రూడాయిల్ నిల్వలు ఎన్ని? అవి ఎన్ని రోజుల వరకూ మన అవసరాలు తీర్చగలవు? ఇలాంటి ప్రశ్నలు తలెత్తడం సహజం. ఎకనామిక్ టైమ్స్ లో వచ్చిన ఒక ఆర్టికల్ అంచనాల ప్రకారం భారత్ దగ్గర దాదాపు 100 మిలియన్ బారెల్స్ వాణిజ్య ముడి చమురు నిల్వలు ఉన్నాయి. ఇప్పుడు పూర్తిగా భారత్ కు వచ్చే ఆయిల్ సరఫరా ఆగిపోతే, ఈ నిల్వలు భారత దేశ అవసరాలను 40-45 రోజుల పాటు తీర్చగలవు.
భారత్ తనకు అవసరమైన క్రూడ్ ఆయిల్ లో 88 శాతం దిగుమతి చేసుకుంటుంది. దీనిలో 50 శాతానికి పైగా మధ్య ప్రాచ్య దేశాలు సరఫరా చేస్తాయి. ఈ ఆయిల్ అంతా హార్ముజ్ జలసంధి గుండా రవాణా అవుతాయి. ఇప్పుడు ఈ యుద్ధం కారణంగా దీని నుంచి ఆయిల్ రవాణా ఆగిపోయింది.
India crude oil stocks: సాధారణంగా ఆయిల్ రిఫైనరీ కంపెనీలు వాణిజ్య నిల్వలను ఉంచుకుంటాయి. అదేవిధంగా ఇప్పటికే రవాణాలో ఉన్న (హార్ముజ్ జలసంధి దాటిన) కార్గోలు వస్తూనే ఉంటాయి. కొంతకాలం పాటు ఇవి మన దేశ అవసరాలకు ఉపయోగపడతాయని ఈటీ తన కథనంలో పేర్కొంది.
రష్యా నుంచి కొనుగోళ్ళకు ప్రయత్నం..
ఇక ఇప్పటికే భారత్ ఆయిల్ సమస్యపై దృష్టి సారించింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయయించినట్టు, ఆ దిశలో ప్రయత్నాలు మొదలైనట్టు తెలుస్తోంది. గతంలో భారత్ రష్యా నుంచి ఎక్కువగానే ఆయిల్ దిగుమతి చేసుకునేది. అయితే, ట్రంప్ సుంకాల నేపథ్యంలో.. అమెరికా ఆంక్షలతో గత నెలలో ఆ దిగుమతులను భారీగా తగ్గించుకుంది. దీంతో ఇప్పుడు మధ్య ప్రాచ్యంలో ఏర్పడిన సమస్యలతో ఆయిల్ దిగుమతుల కోసం మళ్ళీ రష్యాపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది.
ఏదిఏమైనా దీర్ఘకాలం మధ్యప్రాచ్యంలో యుద్ధం నడిస్తే కనుక ఆ ప్రభావం భారత్ పై తీవ్రంగా పడుతుంది. ఇప్పటికే క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. భవిష్యత్ లో ఇవి మరింత పెరిగిపోయే అవకాశం ఉంది. ఒక డాలర్ క్రూడాయిల్ ధర పెరిగితే అది భారత్ పై 13 వేల కోట్ల రూపాయల భారాన్ని వేస్తుందని ఒక అంచనా.