Stock Market Crash: కుప్పకూలిన షేర్ మార్కెట్.. ఒక్కరోజే రూ.17.50 లక్షల కోట్లు ఆవిరి!
మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు ఇన్వెస్టర్ల సంపదను దహించివేశాయి. సోమవారం మార్కెట్ ప్రారంభమవడమే భారీ నష్టాలతో మొదలైంది.
Stock Market Crash: కుప్పకూలిన షేర్ మార్కెట్.. ఒక్కరోజే రూ.17.50 లక్షల కోట్లు ఆవిరి!
మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు ఇన్వెస్టర్ల సంపదను దహించివేశాయి. సోమవారం మార్కెట్ ప్రారంభమవడమే భారీ నష్టాలతో మొదలైంది. ఉదయం సెషన్లో సెన్సెక్స్ ఏకంగా 2,700 పాయింట్లకు పైగా పతనమై ఇన్వెస్టర్లకు కోలుకోలేని దెబ్బ తీసింది. సోమవారం ఉదయం సెన్సెక్స్ 3.30% (2,743 పాయింట్లు) పడిపోయి 78,543 వద్ద ప్రారంభమైంది. ఇది గత 11 నెలల కనిష్ట స్థాయి. ఇక నిఫ్టీ 533 పాయింట్లు క్షీణించి 24,645 వద్దకు చేరింది. అక్టోబర్ 1 తర్వాత నిఫ్టీ ఈ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి. బీఎస్ఈ (BSE) మార్కెట్ క్యాపిటలైజేషన్ శుక్రవారం రూ.463.50 లక్షల కోట్ల నుంచి సోమవారం రూ.445.91 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే ఇన్వెస్టర్లు కేవలం కొన్ని గంటల్లోనే రూ.17.59 లక్షల కోట్లు నష్టపోయారు.
మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు ఇవే..
ఇరాన్ సుప్రీం నాయకుడి మరణం: ఇరాన్ సుప్రీం నాయకుడు 86 ఏళ్ల అయాతుల్లా అలీ ఖమేనీ అమెరికా-ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో మరణించారనే వార్తలతో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ దాడులు చేయడంతో యుద్ధం ముదురుతుందనే భయాందోళనలు ఇన్వెస్టర్లలో పెరిగాయి.
ముడి చమురు ధరల పెరుగుదల: గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 6% పెరిగి బ్యారెల్కు $77.08 కు చేరింది. సరఫరాలో అంతరాయం ఏర్పడితే చమురు ధర $100 మార్కును చేరుకోవచ్చని బార్క్లేస్ (Barclays) అంచనా వేస్తోంది. ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా ఉన్న 'హోర్ముజ్ స్ట్రెయిట్' ప్రాంతంలో క్షిపణి దాడులు జరగడం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది.
ఈ రోజు మార్కెట్లో నష్టపోయిన & లాభపడిన షేర్లు ఇవే:
టాప్ లూజర్స్: ఇండిగో, ఎల్అండ్టీ (L&T),అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లు 2-4% వరకు పడిపోయాయి. రియల్టీ, ఆటో, ఐటీ, పీఎస్యూ బ్యాంక్ సెక్టార్లలో 1-2% నష్టాలు నమోదయ్యాయి.
టాప్ గెయినర్స్: యుద్ధ వాతావరణం వల్ల డిఫెన్స్ స్టాక్స్కు డిమాండ్ పెరిగింది. భారత్ ఎలక్ట్రానిక్స్ (BEL) షేర్లు 1% పైగా లాభపడ్డాయి.
పశ్చిమ ఆసియాలో యుద్ధం త్వరగా ముగియకపోతే మార్కెట్లపై ఒత్తిడి మరింత పెరుగుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక మార్కెట్లకు ఇది స్వల్ప మధ్యకాలికంగా పెద్ద సవాలుగా మారనుందని చెప్పారు. ప్రస్తుతానికి మార్కెట్ కొంత కోలుకున్నట్లు కనిపిస్తున్నా, యుద్ధ పరిణామాలు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచించారు.